అగ్నిపథ్ పేరుతో ఆర్మీలో కొత్త సర్వీస్-మూడునెలల్లో రిక్రూట్ మెంట్- ఫస్ట్ బ్యాచ్ లో 45వేల మంది
భారత దేశ సరిహద్దుల్లో సవాళ్లు పెరుగుతున్నాయి. ఏటా లక్షల కోట్లు రక్షణ వ్యయం రూపంలో ఖర్చువుతోంది. అయినా మన సరిహద్దులు పూర్తి సురక్షితంగా ఉన్నాయా అంటే కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేని పరిస్ధితి. ఈ నేపథ్యంలో ఆర్మీ కూడా పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. వీటిని తట్టుకోవాలంటే మరింత యువ శక్తితో పాటు దేహదారుఢ్యం కూడా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఆర్మీలో కొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టింది.
అగ్నిపథ్ పేరుతో ఆర్మీలో కొత్త రిక్రూట్ మెంట్ సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ఇవాళ ప్రకటించింది. యువత, సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఈ సర్వీస్ లో ఎంపికలు ఉంటాయని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ వెల్లడించారు. అగ్నిపథ్ సర్వీస్ లో ఎంపిక కోసం 90 రోజుల్లో తొలి ర్యాలీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అగ్నిపథ్ పథకంలో సాయుధ బలగాల్లో చేరేందుకు యువతకు అవకాశం లభిస్తుందన్నారు. అగ్నిపథ్ నియామకాల కోసం టూర్ ఆఫ్ డ్యూటీ పేరుతో ప్రత్యేక ర్యాలీలు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది.
ఈ ఏడాది తొలి బ్యాచ్ కింద అగ్నిపథ్ ద్వారా 45 వేల మందిని నియమించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అగ్నిపథ్ సర్వీస్ లో చేరాలంటే 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉండాలని కేంద్రం సూచించింది. ఇలా ఎంపికైన వారికి ఆరునెలల పాటు శిక్షణ ఇచ్చి మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగిస్తారు.
ఆర్మీ సర్వీసు పూర్తయిన తర్వాత మెరుగైన ప్యాకేజీ ఇచ్చి 25 శాతం మందిని శాశ్వత కమిషన్ లో నియమిస్తారు. ఇలా అగ్నిపథ్ సర్వీసులో చేరిన వారికి ఆర్మీతో సమానంగా ర్యాంకులు, వేతనాలు, గౌరవం కల్పిస్తారు. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నాక అగ్నివీర్ సర్టిఫికెట్ ఇచ్చి రిటైర్మెంట్ తర్వాత ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తారు.