హెల్త్ వర్కర్లపై నాడు పూలు చల్లిన మోడీ సర్కార్..నేడు రూ.50 లక్షల బీమా వెనక్కి తీసుకుందా?
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా లక్షలాది హెల్త్ వర్కర్లకు అమలు చేస్తోన్న కోవిడ్ బీమా పథకాన్ని ఉపసంహరించుకుంది. ఆ బీమా కవరేజ్ విలువ 50 లక్షల రూపాయలు. కరోనా వైరస్ బారిన పడిన వారికి వైద్య సేవలను అందిస్తూ ఆ మహమ్మారి వల్ల ప్రాణాలను కోల్పోయిన హెల్త్ వర్కర్ల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని వర్తింపజేయడానికి ఉద్దేశించిన బీమా పథకం అది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఇది అమల్లో ఉంటూ వచ్చింది.
22 లక్షల మంది హెల్త్ వర్కర్లకు..
తాజాగా దీన్ని ఉపసంహరించుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తొలి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ బీమాను ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది మార్చి 26వ తేదీన దీనిపై ఓ ప్రకటన చేశారు. కరోనాను ఎదుర్కొనడంలో ముందుండి పోరాడుతోన్న హెల్త్ కేర్ వర్కర్లకు ప్రకటించిన ఈ 50 లక్షల రూపాయల బీమా పథకం గత ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ పేరుతో ప్రకటించిన ఈ బీమాలో దేశవ్యాప్తంగా 22,12,000 మంది హెల్త్ కేర్ వర్కర్లకు 50 లక్షల చొప్పున బీమా కవర్ లభించింది.
పొడిగిస్తూ వచ్చి.. చివరికి ఎత్తేసి
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తోన్న డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. ఈ బీమాను తొలుత 90 రోజుల పాటు అమల్లో ఉంటుందని కేంద్రం ప్రకటించినప్పటికీ.. ఆ తరువాత కరోనా తీవ్రత తగ్గకపోవడంతో దాన్ని పొడిగిస్తూ వచ్చింది. కోవిడ్ రిలీఫ్ ప్యాకేజీ కింద ఈ పథకాన్ని అమలు చేయడానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 1.7 లక్షల కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. తాజాగా ఆ పథకాన్ని ఉపసంహరించుకున్నట్లు ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది.
కిందటి నెల 24వ తేదీ వరకే..
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నెల ఓ సర్కులర్ను జారీ చేసినట్లు పేర్కొంది. ఈ పథకం కింద కిందటి నెల 24వ తేదీ వరకు 287 క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. వాటిపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని ఆ కథనం స్పష్టం చేసింది. 22 లక్షలకు పైగా సఫాయి కర్మచారీలు, వార్డు బాయ్స్, నర్సులు, ఆశా వర్కర్లు, పారామెడికోలు, టెక్నీషియన్లు, డాక్టర్లు, ఇతర వైద్య రంగానికి చెందిన స్పెషలిస్టులను అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలోకి తీసుకొచ్చింది.
రెట్టింపు తీవ్రత ఉన్నా..
ఇప్పటిదాకా 739 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఈ పథకం కింద కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని పొందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్పష్టం చేసినట్లు ఆ కథనం తెలిపింది. వారిలో సెకెండ్వేవ్ కరోనా వైరస్ బారిన పడిన ముగ్గురు డాక్టర్లు కూడా ఉన్నట్లు పేర్కొంది. కిందటి నెల 24వ తేదీ అర్ధరాత్రి వరకు వచ్చిన క్లెయిమ్లను మాత్రమే అనుమతించాలని ఆదేశిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు వెళ్లినట్లు స్పష్టం చేసింది. గత ఏడాది కంటే కరోనా తీవ్రత రెట్టింపు స్థాయిలో ఉన్నప్పటికీ.. బీమాను ఉపసంహరించుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.