రాజధానికి చంద్రబాబు 'సింగపూర్' టచ్! మోడీకి జ్ఞాపిక
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో సింగపూర్ పర్యటనకు బయలుదేరారు. ఆయన మూడు రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. పెట్టుబడులు, రాజధాని నిర్మాణం తదితరాలు బాబు పర్యటన ప్రధాన ఉద్దేశ్యాలు. చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, పీ నారాయణ, ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, పలువురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు.
చంద్రబాబు అండ్ కో సింగపూర్ ఎదిగిన క్రమాన్ని పరిశీలిస్తారు. చంద్రబాబు వివిధ కంపెనీల సీఈవోలతో మాట్లాడనున్నారు. ఉపరితల రవాణా పైన సింగపూర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సింగపూర్ ఉప ప్రధాని ఇచ్చే విందులో పాల్గొననున్నారు. సింగపూర్ పరిణామ క్రమం పైన ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సందర్శిస్తారు.
సింగపూర్ స్ఫూర్తితో ఏపీని ఎలా అభివృద్ధి చేయాలన్న కోణంలో పర్యటన సాగిస్తారు. సింగపూర్లో జరిగే దక్షిణాసియా వార్షిక సదస్సులో చంద్రబాబు కీలకోపన్యాసం చేయనున్నారు. సింగపూర్ విదేశాంగ మంత్రి కే షణ్ముగం, సీనియర్ మంత్రి గోచోక్ టోంగ్, వాణిజ్య, పారిశ్రామిక శాఖ మంత్రి ఎన్ ఈశ్వరన్లతో బాబు భేటీ కానున్నారు.

సింగపూర్లోని అత్యాధునిక రవాణా వ్యవస్థ, నౌకాశ్రయాలు, ఉపరితల రవాణా, గృహ నిర్మాణం, నగరాల్లో ప్రజా రవాణా తదితర వ్యవస్థలను పరిశీలిస్తారు. ఏపీ అభివృద్ధి నమూనా పైన చంద్రబాబా బృందం అధ్యయనం చేస్తుంది. అనంతరం 14న రాత్రి తిరిగి వస్తారు.
ఏపీకి సాధ్యమైనన్ని పరిశ్రమలు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, 24 గంటల విద్యుత్, ఇచ్చే ఇన్సెంటివ్లు తదితర అంశాలను ఆయన పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. అలాగే రాజధాని అంశం పైన దృష్టి సారించనున్నారు.

ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిని నిర్మించాలని ఆకాంక్షిస్తున్నామని, అలా కట్టాలంటే అన్నింటిని పరిశీలించాల్సి ఉంటుందని మంత్రి నారాయణ చెప్పారు. పెట్టుబడులను ఆకర్షిస్తామని యనమల రామకృష్ణుడు చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి, పట్టణాభివృద్ధి కోసం తమ పర్యటన ఉపయోగపడుతుందని కంభంపాటి ఆకాంక్షించారు.
కాగా, రాజధాని నిర్మాణ సలహా కమిటీలో సింగపూర్ అభివృద్ధి ప్రణాళిక విభాగంలో ముఖ్యుడు, జాతీయ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంటర్ ఫల్ లివబుల్ సిటీస్ (సీఎల్సీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖూ తెంగ్ చెయ్ను సభ్యుడిగా ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసింది.
మయన్మార్లో మోడీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మయన్మార్లో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మోడీ పది రోజుల విదేశీ పర్యటనకు వెళ్లారు. మొదటగా మయన్మార్, తర్వాత ఆస్ట్రేలియా, పిజీలలో ఆయన పర్యటిస్తారు.
ఈ పర్యటనలో మోడీ పలు కీలక సదస్సులలో పాల్గొంటారు. ఆస్ట్రేలియాలో జీ 20 సమావేశాల్లో పాల్గొని అనంతరం కాన్బెర్రాలో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. కాగా, మయన్మార్కు చేరుకున్న మోడీ మయన్మార్ ప్రెసిడెంట్ యూ థీన్ సేన్తో ప్రెసిడెంట్ పాలస్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీకి ఆయన జ్ఞాపిక ఇచ్చారు.












Click it and Unblock the Notifications