వైజాగ్ లో చంద్రబాబు భారీ ర్యాలీ-ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్..
భారత్ ను 2047 నాటికి గ్లోబల్ పవర్ గా నిలిపేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై రూపొందించిన ఐదు వ్యూహాల ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ విశాఖపట్నంలో విడుదల చేశారు. భారత్ స్వాతంత్రం తెచ్చుకుని 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వందేళ్ల పూర్తి నాటికి అగ్రరాజ్యంగా ఎదగడానికి దోహదపడే ఐదు వ్యూహాల్ని ఈ డాక్యుమెంట్ లో తయారు చేశారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ అనే సంస్ధ కు ఛైర్మన్ గా ఉన్న చంద్రబాబు.. తాము రూపొందించిన ఈ డాక్యుమెంట్ ను ఇవాళ విడుదల చేశారు.

భారతావని 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ విశాఖ నగరంలోని బీచ్ రోడ్డులో చంద్రబాబు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, విద్యార్ధులు, మేథావులతో కలిసి ఈ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భారీ ఎత్తున జనం పాల్గొన్నారు. వారంతా జాతీయ జెండాలతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చంద్రబాబు కూడా భారీ జాతీయ జెండాను పట్టుకుని వారితో కలిసి నడిచారు. ఈ విజన్ డాక్యుమెంట్ పై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ చేపట్టారు.

అనంతరం 'ఇండియా, ఇండియన్స్, తెలుగూస్-విజన్ 2047' పేరుతో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే స్థితికి ఎదగటానికి 5 వ్యూహాల (స్ట్రాటజీస్) తో కూడిన దార్శనిక పత్రాన్ని చంద్రబాబు విడుదల చేశారు. విజన్ 2047లో ప్రతిపాదించిన 5 వ్యూహాలు (స్ట్రాటజీస్) ఇలా ఉన్నాయి.
1.గ్లోబల్ ఎకానమిగా భారత ఆర్థిక వ్యవస్థ-ప్రపంచ పౌరులుగా భారతీయులు-బహుళ జాతీయ కంపెనీలుగా భారత కార్పొరేట్లు
2.డెమోగ్రాఫిక్ మేనేజ్ మెంట్ - పి 4 మోడల్ సంక్షేమం
3.సాంకేతికత, పరిశోధన, సృజనాత్మకత (ఇన్నోవేషన్) - భావి నాయకత్వం
4.ఎనర్జీ సెక్యూర్ ఇండియా - డెమోక్రైజేషన్, డీకార్బనైజేషన్ మరియు డిజిటలైజేషన్
5.వాటర్ సెక్యూర్ ఇండియా

అనుభవరీత్యా ప్రణాళికాబద్ధమైన విధానాలతో, నిర్దిష్ట దార్శనికతతో ప్రపంచానికి నాయకత్వం వహించే స్థోమతను పెంచుకోవాలనే సవాళ్లతో కూడిన లక్ష్యాన్ని పెట్టుకుని భారతదేశం ముందుకు పయనించాలనేది తమ ఉద్దేశమని చంద్రబాబు ఈ దార్శనిక పత్రం తొలి పలుకులో అభిప్రాయపడ్డారు. తన స్వాతంత్ర్య శత వర్షాల సంబరాలు జరుపుకునే 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదగాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications