అసత్య ‘కిడ్నాప్’ ప్రచారంతో 29హత్యలు: వాట్సాప్కు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా వేదిక అయిన వాట్సాప్పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్లో అసత్య వార్తలు ప్రచారం కావడం వల్ల పలువురు అమాయకులపై కొందరు దాడులకు దిగుతున్నారని, దీని వల్ల పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారని... అటువంటి తప్పుడు సందేశాలు వైరల్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం వాట్సాప్ను హెచ్చరించింది.
Recommended Video
'వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం కావడం వల్ల అవి నిజమని ప్రజలు నమ్ముతున్నారు. దీంతో పలువురు అమాయకులపై దాడికి దిగుతున్నారు. ఫలితంగా ఒక్కోసారి బాధితులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి' అని ఐటీ శాఖ మంత్రిత్వ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, 'పిల్లలను అపహరించుకుపోతున్నారంటూ వాట్సాప్లో నకిలీ వార్తలు వైరల్గా మారాయి. ఇటువంటి ఘటనలు అసోం, మహారాష్ట్ర, కర్ణాటక, త్రిపుర, పశ్చిమబెంగాల్, తదితర రాష్ట్రాల్లో ఇటీవల చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు చాలా బాధించాయి. రెచ్చగొట్టే విధంగా ఉండే సందేశాలు ఇకపై వాట్సాప్లో వైరల్గా మారకుండా సదరు సంస్థ తగిన చర్యలు తీసుకోవాలి' అని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
డేంజరస్ వాట్సాప్ : ఒకే ఒక మెసేజ్...29 మంది ప్రాణాలు తీసింది
గత కొంత కాలంగా ఈ వాట్సాప్ అసత్యపు ప్రచారాల కారణంగా సుమారు 29మందిని వివిధ రాష్ట్రాల్లో పిల్లలను కిడ్నాప్ చేసేవారిగా భావించి దారుణంగా కొట్టి చంపడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ స్పందించింది.