తాళి కట్టిన వాడిని కాదని ప్రియుడిని నమ్మినందుకు... ఏం జరిగిందంటే..
తన ప్రేమకు ఇంట్లోని వారు అడ్డుచెప్పడంతో పెద్దలకు భయపడి ప్రేమించిన వాడిని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ ప్రేమికుడిని మరిచిపోలేక మూడుముళ్లు వేసిన భర్తను కాదని ప్రేమికుడితో వెళ్లిపోయింది.
చెన్నై : ఓ యువకుడిని ప్రేమించిన యువతి.. తన ప్రేమకు ఇంట్లోని వారు అడ్డుచెప్పడంతో పెద్దలకు భయపడి ప్రేమించిన వాడిని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
కానీ ప్రేమికుడిని మరిచిపోలేక మూడుముళ్లు వేసిన భర్తను కాదని ప్రేమికుడితో వెళ్లిపోయింది. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా ఎయ్యత్తూరులో సంచలనం కలిగిస్తోంది.
వివరాల్లోకి వెళితే... విల్లుపురం జిలా ఉలుందూరుపేటనగర్ గ్రామానికి చెందిన రాజారామ్ కుమార్తె జయప్రద (22) అదే ప్రాంతానికి చెందిన ఇంజనీర్ రాజ్వేల్ (25) ప్రేమించుకున్నారు.
ఐదేళ్లు గుట్టుగా సాగిన వీరి ప్రేమాయణం ఆ తరువాత తెలియడంతో రాజారామ్ వెంటనే తన కుమార్తెకు మరో సంబంధం చూశాడు. మూడు నెలల క్రితం కడలూరు జిల్లా ఎయ్యత్తూరుకు చెందిన సతీష్ (30)కి జయప్రదను ఇచ్చి వివాహం జరిపించారు.
అయతే వివాహానంతరం కూడా జయప్రద భర్తకు దూరంగా ఉంటోంది. పుట్టింటిపై దిగులుతో జయప్రద అలా ప్రవర్తిస్తోందేమో అని భావించిన సతీష్ ఆమెను పుట్టింటికి తీసుకెళ్లి వదిలి పెట్టాడు.
అయితే జయప్రద అదే అదనుగా తన ప్రియుడు రాజ్వేలుతో ఉడాయించింది. ఇద్దరూ తిరుమలకు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. పదిరోజులపాటు మరో ప్రాంతంలో గడిపారు. జయప్రద కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి రాజారామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వారికోసం గాలిస్తున్నారని పసిగట్టిన రాజ్వేల్ గుట్టుచప్పుడు కాకుండా ఆమెను పుట్టింట్టో వదలిపెట్టి వెళ్లిపోయాడు. నాలుగు రోజులు గడిచినా రాజ్వేల్ తనను చూడటానికి రాకపోవడంతో జయప్రద సోమవారం మధ్యాహ్నం అతడి ఇంటికెళ్లింది.
విషయం తెలుసుకున్న రాజ్వేల్ తల్లిదండ్రులు ఆమెను దుర్భాషలాడి, ఇంట్లోంచి గెంటేయడమే కాక ఇంటికి తాళం పెట్టి పారిపోయారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన జయప్రద ఆ ఇంటి వరండాలో ధర్నా ప్రారంభించింది.
మంగళవారం మధ్యాహ్నం వరకు అన్నపానీయాలు లేకుండా జయప్రద ఆందోళన చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆమె వద్ద విచారణ జరిపారు. తాళకట్టిన భర్తను విడిచి ప్రేమికుడిని నమ్మి మోసపోయానని ఆమె వాపోయింది.
తనకు తన ప్రియుడే కావాలని, రాజ్వేల్ తోనే కాపురం చేస్తానని జయప్రద స్పష్టం చేయడంతో పోలీసులు ఇరువైపుల బంధువులను పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు.