దేశ వ్యాప్తంగా చికెన్ ఎంతగా తింటున్నారో తెలుసా .. షాకింగ్ రిపోర్ట్
కరోనా వైరస్ ప్రబలుతున్న తొలి రోజుల్లో చికెన్ తో కరోనా వస్తుందని పుకార్లు షికార్లు చెయ్యటంతో ఎక్కడికక్కడ చికెన్ అమ్మకాలు నిలిచిపోయాయి. ఇక కరోనా నుండి కాపాడుకోవాలని బలవర్ధకమైన పౌష్టిక ఆహారం తినాలని ప్రచారం జరిగిన నాటి నుండి దేశ వ్యాప్తంగా ప్రజలు చికెన్ మీద తెగ మక్కువ చూపిస్తున్నారు. ఫలితంగా ఏప్రిల్ నెలలో రికార్డ్ స్థాయిలో కోళ్ళను లాగించేశారంటే నమ్మి తీరాల్సిందే.

కరోనా తొలిరోజుల్లో కోడి అంటేనే భయపడిన ప్రజలు
కరోనా లాక్ డౌన్ లో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అయ్యారు. ఎక్కువగా వంటల మీద , తిండి మీద శ్రద్ధ పెంచారు. ఫలితంగా అటు వెజ్ , ఇటు నాన్ వెజ్ ఎడాపెడా లాగించేస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు చికెన్ తింటే కరోనా వస్తుందనే వదంతులు వ్యాపించటం , అదే సమయంలో కోళ్ళకు లంపీ స్కిన్ డిసీజ్ , అలాగే కొక్కెర వ్యాధి ఎక్కువగా రావటంతో దేశ వ్యాప్తంగా ప్రజలెవరూ చికెన్ వంక చూడలేదు. చికెన్ తినాలంటేనే భయపడ్డారు .

చికెన్ తో పోషకాలు అనగానే మళ్ళీ తినటం మొదలెట్టిన చికెన్ ప్రియులు
పౌల్ట్రీ యజమానులు వాటిని మేపలేక , వాటి దాణా కోసం ఎక్కువగా ఖర్చు అవుతుండటంతో కోళ్ళను చాలా తక్కువ ధరకు అమ్ముకున్నారు. కొన్ని చోట్ల వూరికే పంచారు. కొన్ని ప్రాంతాల్లో పారేశారు . ఇక పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా నష్టాల్లో, కష్టాల్లో మునిగిపోయింది. కేజీ రూ.30 ఇస్తామని చెప్పినా అప్పుడు ప్రజలు తినలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చికెన్ తినాలని, కరోనా చికెన్ తింటే రాదనీ పెద్ద ఎత్తున చాలా మంది సెలబ్రిటీలు ప్రచారం నిర్వహించారు . చికెన్ లో పోషకాలు ఉన్నాయని, ఈ పోషకాలతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనే వార్తలు రావడంతో మళ్ళీ చికెన్ తినడం మొదలుపెట్టారు.

ఏప్రిల్ మాసంలో విపరీతంగా చికెన్ అమ్మకాలు
మార్చి నెలాఖరు వరకు చికెన్ అమ్మకాలు పడిపోగా, ఏప్రిల్ నుంచి అమ్మకాలు బాగా జోరందుకున్నాయి . దీంతో పాటుగా ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం కిలో చికెన్ 200 పలుకుతుంది. అయినా సరే మాంస ప్రియులు చికెన్ ను తెగ కొనుగోలు చేస్తున్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టు, డిమాండ్ కు తగిన చికెన్ సప్లై ఇప్పుడు పౌల్ట్రీ వర్గాలకు ఇబ్బందిగా మారింది. 2019 వ సంవత్సరంలో దేశవ్యాపంగా 3.8మిలియన్ మెట్రిక్ టన్నుల చికెన్ అమ్మకాలు జరిగాయి.

దాదాపు 750 టన్నుల చికెన్ అమ్మకాలు జరిగాయని అంచనా
ఇక ఈ ఏడాది కరోనా ప్రభావంతో ఒక నెల చికెన్ అమ్మకాలు తగ్గినా భారీగా పుంజుకున్న అమ్మకాలను గమనిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రోజుకు 20 నుంచి 25వేల టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. అలా లెక్క చేస్తే ఒక్క నెలలోనే 750 టన్నుల చికెన్ అమ్మకాలు జరిగాయని తెలుస్తుంది .ఒకపక్క కరోనా లాక్ డౌన్ ఉన్నా హోటల్స్, రెస్టారెంట్లు మూసేసినా ఈ స్థాయిలో చికెన్ అమ్మకాలు జరగడం విశేషం. దేశ వ్యాప్తంగా ప్రజలు నిత్యం కోళ్ళకు కోళ్ళనే లాగించేస్తున్న తీరు అందర్నీ అవాక్కయ్యేలా చేస్తుంది .












Click it and Unblock the Notifications