భారత్ దెబ్బకు చైనా సైన్యం వెనక్కు ... చర్చలు సఫలమేనా ? గాల్వాన్ లో దశల వారీగా సైన్యం ఉపసంహరణ
తూర్పు గాల్వన్ లోయ వద్ద ఉద్రిక్తతలకు కారణమై ,21 మంది భారత సైన్యాన్ని పొట్టనపెట్టుకున్న చైనా, కవ్వింపు చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఒక దశలో యుద్ధం జరుగుతుంది అన్న భావన కూడా కలిగింది. అయితే చైనా ఎట్టకేలకు వెనక్కు తగ్గిందని తాజా సమాచారం.
Recommended Video
చైనాతో ఇండియా తాజా ఘర్షణలకు మూడేళ్ళ క్రితమే బీజం పడింది:ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పిన చైనా నిపుణురాలు
గాల్వన్ లోయ వద్ద నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్ళిన చైనా సైన్యం
చైనా భారత్ మధ్య గాల్వాన్ లోయ ప్రాంతంలో డ్రాగన్ కంట్రీ చైనా చర్యలకు భారత్ దీటుగా సమాధానం ఇస్తోంది. మరోవైపు, అంతర్జాతీయంగా కూడా భారత్కు పలు దేశాలు మద్దతిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. ఒకవైపు జపాన్, ఇప్పటికే చైనాపై రగిలిపోతున్న అమెరికా వంటి దేశాలు భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్న వేళ తాజా పరిణామాల మధ్య శాంతి కోసం భారత్తో చర్చల్లో పాల్గొంటోన్న చైనా సైన్యం గాల్వన్ లోయ వద్ద ఘర్షణ నేపధ్యంలో ఏర్పాటు చేసిన బఫర్ జోన్ల నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిందని భారత ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
భారత్-చైనా తాత్కాలిక నిర్మాణాల తొలగింపు
అంతేకాదువివాదాస్పదమైన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) వెంట ఇరుదేశాలు ఘర్షణ లో భాగంగా సైన్యాన్ని పెద్దఎత్తున మోహరించాయి. తాత్కాలిక నిర్మాణాలు కూడా చేశాయి .ఇక ఈ నేపథ్యంలో ఘర్షణ నెలకొన్న ప్రాంతం నుంచి భారత్-చైనా తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే, చైనా పారదర్శకంగా వ్యవహరిస్తుందా? మళ్లీ సైన్యాన్ని ముందుకు పంపుతుందా? అన్న విషయంపై తాము దృష్టి పెడతామని భారత అధికారులు పేర్కొన్నారు.
చర్చల్లో భాగంగా దశల వారీగా సైన్యం వెనక్కు
ఎందుకంటే డ్రాగన్ కంట్రీ ఎప్పుడు కుట్రలు కుయుక్తులు తోనే ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది కాబట్టి చైనా పారదర్శకంగా వ్యవహరిస్తుందా లేదా అన్న విషయంపై భారతసైన్యం దృష్టి పెట్టనుంది. నిన్నటి వరకు ఇండియా చైనాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ఇరుదేశాలు పోటాపోటీగా సైనిక చర్యలకు సిద్ధం కాగా ప్రస్తుతం ఉద్రిక్తతలను తగ్గించడానికి జరిగిన చర్చలో భాగంగా గాల్వాన్ లోయ, పాంగాన్ సో , హాట్ స్ప్రింగ్స్ నుంచి సైనికులను వెనక్కు పంపాలని ఇరు దేశాల ఒప్పందం కుదుర్చుకున్న మేరకు దశలవారీగా సైన్యం వెనక్కి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.
చైనా తీరును బట్టే భారత్ నిర్ణయం
తొలిదశలో బలగాలను వెనక్కి పిలిపించిన తర్వాత, చైనా తీరును చూసి రెండో దశలో మరిన్ని బలగాలను ఉపసంహరిస్తామని భారత దేశ అధికారులు చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరోమారు ఇరు దేశాల అధికారులు సమావేశమై నెలకొన్న వివాదంపై చర్చలు జరిపే అవకాశం ఉంది. లడక్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రశాంతతను పునరుద్ధరించడం కోసం భారత్ శతవిధాలా ప్రయత్నం చేస్తోంది.
కార్ప్ కమాండర్ స్థాయి సమావేశాలు
కార్ప్ కమాండర్ స్థాయి సమావేశాలను నిర్వహించి ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఇక సరిహద్దు సమస్యల నిర్వహణకు సంబంధించిన అనేక ఒప్పందాల నిబంధనలు కూడా కచ్చితంగా పాటించాలని భారత్ కూడా చర్చల్లో గట్టిగా పేర్కొందని భారత వర్గాలు చెబుతున్నాయి. ఇక దీంతో ఇండియా చైనా ఘర్షణకు ఫుల్ స్టాప్ పడుతుందా ? లేదా చూడాల్సి వుంది.