చైనా కావరం: బూట్ల పెట్టెలపై భారత జెండా
డోక్లామ్ వివాదం భారత్, చైనా దేశాల సంబంధాలపై తీవ్రం ప్రభావం చూపుతున్న నేపథ్యంలో చైనా మరోసారి తన దురంహంకారాన్ని చాటుకుంది.
డెహ్రాడూన్: డోక్లామ్ వివాదం భారత్, చైనా దేశాల సంబంధాలపై తీవ్రం ప్రభావం చూపుతున్న నేపథ్యంలో చైనా మరోసారి తన దురంహంకారాన్ని చాటుకుంది. మన జాతీయ పతాకంలో ఉండే మూడు రంగులతో కూడిన బాక్సుల్లో బూట్లను ప్యాకింగ్ చేసి పంపినట్లు స్థానిక దుకాణదారుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ అల్మోరాలో చోటు చేసుకుంది.
మూడు రంగుల పెట్టెల్లో..
రుద్రాపూర్ తమ్మన ట్రేడర్స్ పంపించిన సరుకును వచ్చిన వెంటనే తెరిచి చూసినట్లు ఫిర్యాదుదారుడు బిషన్ బోరా తెలిపారు. ఏడు జతల బూట్లు సాధారణ పెట్టెల్లో ఉన్నాయని, మరికొన్ని మూడురంగుల బాక్సుల్లో వుంచి తమకు పంపినట్లు పోలీసులకు వివరించాడు.
ఇది చైనా కుట్రే..
సదరు బాక్సులు చైనా నుంచి వచ్చినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బూట్లను పంపిన పెట్టెల పైభాగంలో మూడు రంగుల జెండా, అడుగున మాండరిన్ భాషలో పదాలు రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డోక్లామ్ వివాదం నేపథ్యంలో భారతీయుల మనోభావాలను దెబ్బతీసేందుకు చైనా పన్నిన కుట్రగా స్థానికులు భావిస్తున్నారు.
వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం..
కిరాణా దుకాణదారుడు బిషన్ బోరా చేసిన ఫిర్యాదు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు అల్మోరా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) రేణుకా దేవి తెలిపారు. బూట్లను దుకాణదారుడికి సరఫరా చేసిన రుద్రపూర్లోని తమ్మన ట్రేడర్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు ఉద్దమ్ సింగ్నగర్ ఎస్ఎస్పీ సదానంద్ చెప్పారు.
చర్యలు తీసుకోవాల్సిందే..
ఢిల్లీలోని డిస్ట్రిబ్యూటర్ నుంచి తెప్పించామని, అతను ఎక్కడ ఉంటారనే విషయం తమకు తెలియదని తమ్మన ట్రేడర్స్ యాజమాన్యం చెప్పినట్లు ఎస్ఎస్పీ వివరించారు. త్వరలోనే ఢిల్లీ డిస్ట్రిబ్యూటర్ను ప్రశ్నిస్తామని చెప్పారు. కాగా, భారత జాతీయ జెండాను అవమానించిన వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని బీజేపీ అల్మోరా జిల్లా అధ్యక్షుడు లలిత్ లాత్వాల్ అధికారులను కోరారు.