ఆదేశిస్తే సిఎంనవుతా:చిరు, మోడీపై సెటైర్, వెంట శ్రీకాంత్
చెన్నై: పార్టీ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఆదివారం అన్నారు. ఆయన కన్యాకుమారి జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటను బయట పెట్టారు. చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరోవైపు అధిష్టానం నుండి చిరంజీవికి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో కన్యాకుమారిలో చిరు ఆసక్తికరమైన వ్యాఖ్యలరు చేశారు.
అధిష్టానం ఆదేశిస్తే అవశేషాంధ్ర రాష్ట్రానికి సిఎంగా బాధ్యతలు నిర్వరిస్తానని చెప్పారు. అయితే తనని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తారన్న వార్తలు తన వరకు రాలేదన్నారు. సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరే అవుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి కదా అని విలేకరులు ప్రశ్నించగా, ఈ విషయాన్ని తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదంటూనే, పార్టీకి విశ్వాసపాత్రుడుగా అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని చెప్పారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిందని కితాబిచ్చారు. అంతా అనుకుంటున్నట్లుగా గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ప్రజాస్పందన పెద్దగా లేదన్నారు. దేశం మొత్తం పర్యటిస్తూ తనకు తానుగా మోడీ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కన్యాకుమారి జిల్లాను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.13 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. పర్యాటక అందాలను వీక్షించేందుకు వీలుగా కేబుల్కార్ పథకాన్ని అమలు పరిచేందుకు కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధమైతే సహకరించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తుందన్నారు. చిరంజీవి పర్యటనలో నటుడు శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు.