నా భార్య కోపంగా ఉంది! ఇంటికెవరూ రావొద్దు: డిప్యూటీ సీఎం అజిత్ పవార్
ముంబై: రాష్ట్రంలోని చాలా మంది పిల్లలకు మరాఠీ రాయడం, చదవడం, మాట్లాడటం రావడం లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, మరాఠీని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 10వ తరగతి వరకు మరాఠీ తప్పనిసరి భాషగా చేస్తున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు.
మరాఠీపై డిప్యూటీ సీఎం ఆందోళన
బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెరిగిపోయాయని, వాటిలో చదివే విద్యార్థుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని చెప్పారు. పిల్లలు ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నారు కానీ, మాతృ భాష అయిన మరాఠీని మర్చిపోతున్నారని అన్నారు. వారికి మరాఠీ చదవడం, రాయడం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు అజిత్ పవార్. అందుకే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మరాఠీని తప్పనిసరి భాష చేస్తామని చెప్పారు. అది ఉర్దూ మీడియం కానీ, హిందీ మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ.. ఏ మీడియం అయినా మరాఠీని 10వ తరగతి వరకు బోధించాల్సిందేనని స్పష్టం చేశారు.
మాతృభాష నేర్చుకోవాలి..
మనం మహారాష్ట్రలోనే నివసిస్తున్నాం. ప్రతీ ఒక్క పిల్లవాడు మరాఠీని స్పస్టంగా చదవాలి. రాయాలి. అదనంగా ఒక సబ్జెక్టు చేరడం ద్వారా 10, 12 క్లాసుల విద్యార్థులు తమ మార్కులు తగ్గుతాయని భావించే అవకాశం ఉందని, అయితే, పర్సంటేజీలో కోసం ఆలోచించవద్దని.. మాతృభాషను నేర్చుకోవాలని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సూచించారు.
నా భార్య కోపంగావుంది.. ఎవరూ ఇంటికి రావొద్దు..
ఇది ఇలావుంటే, ఎన్సీపీ కార్యకర్తలు ఎవరూ కూడా తమ ఇంటికి రావద్దని అజిత్ పవార్ సూచించారు. ఏదైనా ముఖ్యమైన పనివుంటే తప్ప రావద్దని కోరారు. నాకు ఇప్పటి వరకు అధికారిక నివాసం కేటాయించలేదు. మా ఇంటి వద్దకు వస్తే డైనింగ్ రూం, బెడ్ రూంలో కార్యకర్తలను కలవాల్సి వస్తుందని అన్నారు. ఈ క్రమంలో నాకు పెద్ద ఇళ్లు కేటాయించేవరకు కూడా నేను ఈ ఇంట్లో ఉండలేనని భార్య సునేత్ర చెబుతోందని అజిత్ పవార్ చెప్పారు. తన భార్య కోపంగా ఉందని చెప్పిన ఆయన.. ఏదైనా ముఖ్యమైన పనివుంటే తప్ప కార్యకర్తలు ఎవరూ తమ ఇంటికి రావద్దని మరోసారి చెప్పారు.