జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ చేసి రాడ్లతో చితకొట్టారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో ఇద్దరు విద్యార్ధులను ర్యాగింగ్ పేరిట రాడ్లతో కొట్టి హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సీనియర్ల దాడిలో గాయపడిన ఇద్దరు విద్యార్ధులు తీవ్రగాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై వారి సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. గాయపడిన విద్యార్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజూ తమ ఆహార పదార్థాలను సీనియర్లు లాక్కునేవారని, ఒకవేళ అవి సీల్డ్ ప్యాకెట్లలో లేకపోతే తిరిగి మొహం మీద కొట్టేవారని బాధితుల్లో ఒకడైన ధ్రువ్ అగర్వాల్ తెలిపాడు.

సీనియర్ విద్యార్థులు కొందరు తరచు తమను వేధిస్తుండేవారని పేర్కొన్నాడు. సీనియర్ విద్యార్థులు హాస్టల్లో తమ పిల్లలను ర్యాంగింగ్ చేసి, దాడికి దిగినట్టు గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. మరో విద్యార్ధి యశ్ప్రతాప్ సింగ్ తండ్రి అర్జున్ సింగ్ ఈ ఘటనపై మాట్లాడుతూ ర్యాగింగ్ పేరుతో తమ కుమారుడిని రాడ్లతో కొట్టారని తెలిపారు.
ఈ ఘటన సోమవారం జరిగినప్పటికీ, తమకు సమాచారం అందించలేదని యాజమాన్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పేదాకా ఈ విషయం తెలియలేదని అన్నారు. 'ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులు నా కుమారుడిపై రాడ్లతో దాడి చేశారు.
ఆ తర్వాత నా కుమారుడి పరిస్థితి ఎలాగ ఉందో కూడా సమాచారం ఇవ్వలేదు' అని ఆయన వాపోయారు. 15 రోజుల క్రితమే తన కుమారుడు కాలేజీలో చేరాడని అన్నారు. ఇదిలా ఉంటే దాడిలో గాయపడిన విద్యార్ధుల ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనకు సంబంధించి 18 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు నోయిడా పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications