వేరే దారి లేక అలా చేశాం: ఎంపి సిఎం రమేష్ వివరణ
న్యూఢిల్లీ: అప్రజాస్వామికంగా జరుగుతున్న రాష్ట్ర విభజన అంశాన్ని దేశానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వేరే దారిలేక తాము సభలో ఆందోళన చేశామని, అంతే తప్ప సభ పట్ల గానీ, చైర్మన్ పట్ల గానీ తమకు ఎలాంటి అగౌరవమూ లేదని తెలుగుదేశం సభ్యుడు సీఎం రమేశ్ రాజ్యసభకు తెలిపారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు.
గత కొద్ది రోజులుగా ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద నిలబడి చేసిన ఆందోళనపై తనంతట తానుగా వివరణ ఇచ్చారు. 11 కోట్ల మంది తెలుగు ప్రజల ప్రయోజనాలతో తమ ఆందోళన ముడిపడి ఉందని, తాము ఏ పరిస్థితుల్లో ఆందోళనకు దిగాల్సి వచ్చిందో సభ్యులంతా అర్థం చేసుకోవాలని సూచించారు.
అంతకు ముందు తాము ఎంతో క్రమశిక్షణ గల సభ్యులుగా మెలిగామని, ఇకపై కూడా అదే రీతిలో ఉంటామని, సభ్యుల గుర్తింపు పొందుతామని చెప్పారు. తమ ఆందోళన సందర్భంగా సభ్యులు, సిబ్బందికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు.
తెలంగాణ బిల్లు రాజ్యసభకు వచ్చిన నేపథ్యంలో సిఎం రమేష్ రాజ్యసభలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సెక్రటరీ జనరల్తో కలబడి కాగితాలు లాక్కునే ప్రయత్నం కూడా చేశారు. దానిపై అదే రోజు ఆయన క్షమాపణ కూడా చెప్పారు.