ఆ దగ్గు సిరప్ లలో కోడైన్: బానిసలవుతున్న బాధితులు, నిషేధంపై జరుగుతుందిదే.. తస్మాత్ జాగ్రత్త!!
శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్లో చాలామంది దగ్గుతో బాధపడేవారు ఉపశమనం కోసం దగ్గు సిరప్ లపై ఆధారపడుతూ ఉంటారు. అయితే ఓవర్ ది కౌంటర్ దగ్గు సిరప్ లు మీకు మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయని చెబుతున్నారు. ఇక దగ్గు సిరప్ తోనే దగ్గుకు ఉపశమనం అని భావించేవారు ముఖ్యంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దగ్గు సిరప్ లలో కోడైన్ మత్తు మందు.. బానిసలవుతున్న దగ్గుబాధితులు
ఓవర్ ది కౌంటర్ దగ్గు సిరప్లలో చాలా వరకు కోడైన్ అని వ్యసనం కలిగించే ఓపియాయిడ్ ఉంటుంది. ఒక 100 మిల్లీలీటర్ల కోడైన్-కలిగిన దగ్గు సిరప్ మార్ఫిన్ యొక్క 30 మిల్లీగ్రాముల టాబ్లెట్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దగ్గు సిరప్ లో ఉండే కోడైన్ అనేది నల్లమందు నుండి తీసుకోబడిన ప్రో-డ్రగ్. ఇది కాలేయంలో మార్ఫిన్గా మారుతుంది. చాలామంది దగ్గుతో బాధపడుతున్నవారు వారికి తెలియకుండానే దగ్గు సిరప్ నిత్యం తాగే వ్యసనానికి బానిసలవుతున్నారు.

ఫెన్సిడైల్, కోరెక్స్ బ్రాండ్ల వ్యసనం.. కూల్ డ్రింక్స్ లో దగ్గు మందు మిక్స్ చేసి తాగుతున్న వైనం
ఇక దగ్గు మందు బాటిల్ పై ఎటువంటి హెచ్చరికలు ఉండని కారణంగా వారు వాటికి బానిసలుగా అవుతున్నారు. ఇక దగ్గు మందులో ఉండే కోడైన్ మనిషి శరీరం పై హాని కలిగించడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది. చాలామంది వ్యసనపరులు ఈ దగ్గు మందులను మత్తు కోసం ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వందకు పైగా దగ్గు సిరప్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలోనూ ఫెన్సిడైల్, కోరెక్స్ బ్రాండ్లు ఎక్కువమంది వినియోగిస్తున్నారు.100 మిల్లీలీటర్ల ఈ దగ్గు మందులు ధర 75 రూపాయలు కావడంతో వీటిని కొనుగోలు చేసి సోడాలలో, కూల్ డ్రింక్స్ లో మిక్స్ చేసి తాగుతున్నారు.

దగ్గు మందులపై నిషేధం విధించాలని పెరుగుతున్న డిమాండ్
దగ్గుమందులోని కోడైన్ మరింత ప్రభావవంతంగా పని చేయడానికి దీనిని తాగిన తర్వాత, వేడి టీ ని కానీ కాఫీ ని గానీ తీసుకుంటారు. కోడైన్ కలిగిన దగ్గు సిరప్ వల్ల మత్తు రావడం, అస్పష్టంగా మాట్లాడడం, వినిపించడంలో తేడా, గుండె కొట్టుకుని రేటు విపరీతంగా పెరగడం, అస్పష్టమైన దృష్టి, బిపి పెరగడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. కోడైన్ కలిగిన దగ్గు సిరప్ తాగిన వ్యక్తి మాదక ద్రవ్యాలను తీసుకున్న వ్యక్తి వలె ప్రవర్తిస్తారు. అయితే దగ్గు సిరప్ లపై ఇటీవల చోటు చేసుకున్న అనేక ఘటనలతో నిషేధించాలని డిమాండ్ పెరుగుతుంది.

గాంబియా ఘటన తర్వాత దేశంలో దగ్గు సిరప్ లపై ఫోకస్ .. ఆ దగ్గుమందులపై నిషేధం?
ఇటీవల, గాంబియాలో 66 మంది పిల్లలు డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్తో కలుషితమైన దగ్గు సిరప్లను తాగటం వల్ల మరణించారు. ఈ సిరప్లను హర్యానాకు చెందిన సంస్థ తయారు చేసింది. ఇక ఈ సంవత్సరం ఆగస్టులో దగ్గు మందులపై పార్లమెంట్లో సభ్యులు వాటిని మత్తు పదార్థాలు గా, మాదకద్రవ్యాలుగా ఉపయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేయడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎంఎస్ భాటియా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని కోడైన్ ఆధారిత కలయికలపై నిషేధాన్ని కూడా సిఫార్సు చేసింది. ఇక ప్రభుత్వ అధికారులు దగ్గుమందుల నిషేధాన్ని చేయాలని కోరుతున్నారు. అయితే ఔషధ తయారీదారులు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

నిషేధంపై ప్రభుత్వం వర్సెస్ ఔషధ తయారీదారులు..
ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ నిషేధం వద్దని అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. నిషేధం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఐడీఎంఏ పేర్కొంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే దగ్గు సిరప్ వ్యసనానికి బానిసలు అయిన క్రమంలో దగ్గు సిరప్ స్మగ్లింగ్ జోరుగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకునే వరకు మత్తు పదార్థమైన కోడైన్ కలిగిన దగ్గు సిరప్ లను ఉపయోగించే విషయంలో తస్మాత్ జాగ్రత్త.












Click it and Unblock the Notifications