ఫోన్ వచ్చిందని ఇంట్లోకి.. ఒంటరి యువతిపై రేప్
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు పి తంగరాజు(25) ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. కాగా, బాధితురాలు(17) 10వ తరగతి వరకు చదివి ఆ తర్వాత మానేసి ఇంట్లోనే ఉంటోంది. బాధితురాలి సోదరికి ముదురైకి చెందిన వ్యక్తి వివాహం కావడంతో ఆమె అక్కడే ఉంటోంది.
బాధిత యువతి ఇంట్లో లాండ్ఫోన్ గానీ, సెల్ఫోన్ గానీ లేదు. దీంతో బాధితురాలి సోదరి తంగరాజుకు ఫోన్ చేసి తమ తల్లిదండ్రులతో మాట్లాడేది. బాధితురాలి సోదరి ఎప్పుడు ఫోన్ చేసినా.. వారి ఇంటికి సమీపంలో ఉండే తంగరాజు ఆమె కుటుంబసభ్యులకు ఫోన్ తెచ్చి ఇచ్చేవాడు.
ఈ క్రమంలోనే శనివారం కూడా బాధితురాలి సోదరి ఫోన్ చేయడంతో ఆమె ఇంటికి వచ్చి ఫోన్ ఇచ్చాడు తంగరాజు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాధిత యువతి ఫోన్ మాట్లాడింది. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన తంగరాజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పరారయ్యాడు.
కాగా, ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులతో బాధిత యువతి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో బాధితురాలితోపాటు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి, నిందితుడు తంగరాజుపై ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గాలింపు చేపట్టి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత యువతిని కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి ఆదివారం తరలించారు.