యూపీ ఎన్నికలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం-మహిళలకు 40 శాతం సీట్లు-కుల రాజకీయానికి కౌంటర్
వచ్చే ఏడాది యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగా మహిళలకు పెద్దపీట వేయాలని నిర్ణయం తీసుకుంది. యూపీలో కుల రాజకీయాలకు కౌంటర్ గా మహిళా శక్తిని తెరపైకి తీసుకురావాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళలకు 40 శాతం టికెట్లు కేటాయిస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. మహిళలు మార్పును తీసుకురాగలరని, వారు ముందడుగు వేయాలని ప్రియాంక తెలిపారు. ఈ నిర్ణయం ఉత్తర్ ప్రదేశ్ అమ్మాయిల కోసం, మార్పు కోరుకునే మహిళల కోసమని ఆమె పేర్కొన్నారు. యూపీలో కుల రాజకీయాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓట్ల కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే యూపీలో బ్రహ్మణులతో పాటు ఇతర అగ్రవర్ణాలు యోగి ఆదిత్యనాథ్ అనే రాజ్పుత్ను సీఎం పదవికి గతంలో బీజేపీ ఎంపిక చేయడంపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో వారిని శాంతింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మహిళలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది.
యూపీలో గత కొన్ని సంవత్సరాలుగా మహిళలపై ఎక్కువగా నేరాలు నమోదవుతున్న నేపథ్యంలో లింగ సమస్యను కూడా కాంగ్రెస్ హైలైట్ చేస్తోంది. ముఖ్యంగా హత్రాస్లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం, ఉన్నావ్లో మైనర్ బాలికపై అఘాయిత్యం కేసు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి దీంతో ఇప్పుడు ఆయా అంశాల్ని మరోసారి తెరపైకి తెస్తూ కాంగ్రెస్ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.