ఎమ్మెల్సీ సీటు రగడ: నటి రమ్యపై ఫిర్యాదు
బెంగళూరు: బహుభాషా నటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు రమ్యకు ఎంఎల్ సీ టిక్కెట్ ఇవ్వరాదని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రమ్య పని తీరు సక్రమంగా లేదని, ఆమె కార్యకర్తలతో సహ నాయకులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
సోమవారం మండ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు లేఖ వ్రాశారు. ఈ సందర్బంలో రమ్య పనితీరుపై వారు మండిపడ్డారు. రమ్యను తమ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడో మరిచిపోయారని వ్యంగంగా అన్నారు.
మాండ్య పార్లమెంట్ ఉప ఎన్నికలలో కష్టపడి రమ్యను ఎంపీగా గెలిపించామని అన్నారు. ఎంపీగా గెలిచిన తరువాత రమ్య జిల్లా ప్రజలకు ఎలాంటి మేలు చెయ్యలేదని గుర్తు చేశారు. తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో రమ్య ఓడిపోయారని చెప్పారు.
ఎన్నికలు పూర్తి అయిన తరువాత రమ్య మాండ్యలో అడుగు పెట్టలేదని అంటున్నారు. విదేశాలలో సంచరిస్తు హాయిగా జల్సాలు చేసిన రమ్యా మండ్య కాంగ్రెస్ నాయకులను సైతం లెక్కచెయ్యడం లేదని, అసలు సంప్రదించడం లేదని ఆరోపించారు.
రమ్య అసలు భారతదేశంలో ఉన్నారా అని ప్రశ్నించారు. మాండ్య జిల్లాలో 18 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారి కుటుంబ సభ్యులను పరామర్శించలేదని, కనీసం ఒక ప్రకటన విడుదల చెయ్యలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.