వ్యవసాయ బిల్లులపై కేంద్రానికి కాంగ్రెస్ ఝలక్- వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా రైతులు భగ్గుమంటున్నారు. కార్పోరేట్ వ్యవసాయాన్ని పోత్సహించేందుకు ఈ బిల్లులు తీసుకొచ్చారని రైతులతో పాటు సామాన్య ప్రజలు, రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గతంలో పిలుపునిచ్చారు.
సోనియా పిలుపుమేరకు పంజాబ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ అసెంబ్లీలో ఇవాళ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. రైతులు, వ్యవసాయాన్ని ఆదుకునే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతివ్వాలని అమరీందర్ కోరారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై పంజాబ్ లో రైతులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రాష్ట్రానికి చెందిన అకాలీదళ్ కూడా రైతుల ఆగ్రహాన్ని గమనించి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు నుంచి తప్పుకుంది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం అమరీందర్ సింగ్.. కేంద్రం ఈ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే ఓ ఆర్డినెన్స్ను తీసుకొచ్చి రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు ఎఫ్సీఐ నుంచే కొనుగోళ్లు జరిగేలా చూడాలని కోరారు.
రైతుల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని వ్యతిరేకిస్తున్నట్లు ఈ ముసాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులతో పాటు విద్యుత్ చట్ట సవరణ బిల్లును కూడా పంజాబ్ అసెంబ్లీ వ్యతిరేకిస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్ర జాబితాలో ఉన్న వ్యవసాయంపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధంగా తెలిపారు. రాష్ట్రాల అధికారాలను లాక్కోవడంలో భాగంగానే ఈ బిల్లులు తీసుకొచ్చారని కాంగ్రెస్ సర్కారు తీర్మానంలో తెలిపింది. ఈ బిల్లులు కచ్చితంగా భూమి లేని రైతుల పాలిట శాపమని అసెంబ్లీలో ప్రసంగం సందర్బంగా సీఎం అమరీందర్ చెప్పారు.