కాంగ్రెస్ పక్షులన్నీ సొంత గూటికి?
న్యూఢిల్లీ: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. దారుణ పరాజయాన్ని చవి చూసిన తరువాత ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సీనియర్లు గుర్తుకొస్తున్నారు. అందుకే- దిద్దుబాటు చర్యలకు దిగారు. వచ్చే అయిదేళ్లలో పార్టీకి పూర్వవైభవం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయి, సొంతంగా పార్టీ పెట్టుకున్న నేతలందర్నీ సొంత గూటికి చేర్చాలని రాహుల్ గాంధీ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా- ఒకప్పటి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ నివాసానికి వెళ్లారు. సుమారు గంట పాటు అక్కడే ఉన్నారు. పార్టీ ఓటమి పాలు కావడానికి కారణాలను అన్వేషించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. మళ్లీ కాంగ్రెస్లో చేరాలని శరద్ పవార్ను కోరినట్లు తెలుస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని మాతృపార్టీలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూడటంతో డీలా పడ్డ కాంగ్రెస్ శ్రేణులన్నింటినీ గ్రామస్థాయిలో ఉత్తేజితులను చేయడం, వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్త పర్చాల్సి ఉందని, దీనికి సహకరించాలని రాహుల్ గాంధీ ఆయనను కోరినట్లు చెబుతున్నారు..
కాంగ్రెస్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విలీనానికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవీ తమ ముందుకు రాలేదని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు స్పష్టం చేశారు. విలీనం దిశగా చర్చలు సాగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ను విలీనం చేయడానికి ఇదే సరైన తరుణమని తాను ముందే సూచించినట్లు ఎన్సీపీ సీనియర్ నేత తారిఖ్ అన్వర్ చెప్పారు. లోక్సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆయన ఎన్సీపీ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
కాంగ్రెస్లో తమ పార్టీని విలీనం చేస్తారనే విషయాన్ని శరద్ పవార్ ఇదివరకే తోసి పుచ్చారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ చెప్పారు. ఇలాంటి వార్తలకు ఎలాంటి ఆధారమూ లేదని అన్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన విషయం తెలిసిందే. శివసేనతో సీట్ల సర్దుబాటు చేసుకుని ఎన్నికల బరిలో నిల్చున్న బీజేపీ 36 సీట్లను గెలుచుకోగలిగింది మహారాష్ట్రలో.
ఇదిలావుండగా- కర్ణాటకలో అధికారాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి న్యూఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. కర్ణాటకలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను ఆయనకు వివరించారు. పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుంటే తప్ప పరిస్థితి అదుపులో వచ్చేలా లేదని తేల్చేశారు. ప్రభుత్వం పతనం అంచుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదే జరిగితే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు.