దేశ ప్రజలు, అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు, బీజేపీలా కాదు: ప్లీనరీలో రాహుల్
Recommended Video
న్యూఢిల్లీ: దేశ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్తోనే దేశ ఐక్యత సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన నేతృత్వంలో శనివారం 84వ కాంగ్రెస్ ప్లీనరీ ఇందిరా గాంధీ మైదానంలో జరిగింది.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఈ ప్లీనరీ దేశానికి, కాంగ్రెస్ సభ్యులకు మార్గదర్శనం కావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ మొత్తాన్ని ఏకం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. పార్టీలోని అనుభవజ్ఞులు యువతకు మార్గనిర్దేశం చేయాలన్నారు.
This is the only symbol (Congress party symbol) that can unite the nation and take it forward: Rahul Gandhi at Congress Plenary Session in Delhi pic.twitter.com/mE4fNbAs4n
— ANI (@ANI) March 17, 2018
దేశంలో యువతను నిరుద్యోగం వెంటాడుతోందని అన్నారు. 'ఈ దేశం ప్రజలందరిది. అన్ని మతాలు, వర్గాల వారిది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పనిచేస్తోంది. వారు(బీజేపీ) విద్వేషంతో దేశాన్ని చీలుస్తున్నారు. మేం ప్రేమతో పనిచేస్తున్నాం. దేశాన్ని ఐక్యంగా ఉంచి ముందుకు నడిపించేది చేతిగుర్తే’ అని రాహుల్ అన్నారు.
కాగా, ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లీనరీ సమావేశాల నిర్వహణను ప్రియాంక గాంధీ చూసుకుంటున్నారు.
అంతకుముందు జరిగిన అంతర్గత సమావేశంలో 2019 లోకసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాహుల్ పార్టీ నేతలకు రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో బీజేపీ వరుస ఓటములతో ప్రజలు ఆ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారనే విషయం తెలిసిపోయిందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చినట్లు సమాచారం.