జీఎస్టీపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. వీడియో విడుదల చేసిన కాంగ్రెస్, అప్పుడెందుకలా?
జీఎస్టీకి మరికొన్ని గంటల్లో జేగంట మోగనున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ గతంలో చేసిన వ్యాఖ్యలపై రూపొందించిన సంచలన వీడియో ఒకదానిని కాంగ్రెస్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆర్థిక స్వాతంత్రంగా అభివర్ణిస్తున్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు మరికొన్ని గంటల్లో జేగంట మోగనున్న తరుణంలో కాంగ్రెస్ సంచలన వీడియో ఒకదానిని విడుదల చేసింది.
''జీఎస్టీ విజయవంతం కాదు, తగిన మౌలిక సదుపాయాలు కల్పించకుండా దానిని అమలు చేయడం అసాధ్యం..'' అని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న వీడియో క్లిప్ను కాంగ్రెస్ విడుదల చేసింది.
Modi ji how quickly you forget your own words. Why are you rolling out GST without developing the proper infrastructure #GSTTamasha pic.twitter.com/5urSMepFN3
— INC India (@INCIndia) June 30, 2017
అంతేకాకుండా, దానికి ''జీఎస్టీ గురించి మోడీ, బీజేపీ నిజమైన అభిప్రాయం ఇదే'' అనే క్యాప్షన్ను తగిలించి కలకలం రేపింది. అయితే ఈ వీడియో ఎప్పటిది? మోడీ ఎప్పుడు ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు అన్న వివరాలు లేవు.
ఆ వీడియోలో మోడీ మాట్లాడుతూ.. ''జీఎస్టీ విషయంలో బీజేపీ అభిప్రాయం, గుజరాత్ ప్రభుత్వ అభిప్రాయం మొదటి నుంచీ ఒకటే. జీఎస్టీ ఎప్పటికీ విజయవంతం కాలేదు'' అని పేర్కొన్నారు.
A reform that holds great potential is being rushed through in a half-baked way with a self-promotional spectacle #GSTTamasha
— Office of RG (@OfficeOfRG) June 30, 2017
దీనికి ఇప్పుడు కాంగ్రెస్ తన అస్త్రంగా వాడుకుంటోంది. ''మోడీ ఎంత త్వరగా తన మాటలను మర్చిపోయారు. సరైన సదుపాయాలు కల్పించకుండానే ఎందుకు దీనిని అమలు చేయాలని తొందరపడుతున్నారు..'' అంటూ కాంగ్రెస్ మరో వీడియోను విడుదల చేసింది.
ఆ వీడియోలో మోడీ మాట్లాడుతూ.. తగిన సదుపాయాలు కల్పించకుండా జీఎస్టీని అమలు చేయడం అసాధ్యమని పేర్కొన్నారు. మరోవైపు జీఎస్టీ అమలు ప్రకటన కార్యక్రమానికి హాజరుకావడం లేదని కాంగ్రెస్ ఇప్పటికే తేల్చి చెప్పింది.
అప్పుడెందుకు వ్యతిరేకించారు?: సురవరం
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ అర్ధరాత్రి నిర్వహించనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జీఎస్టీ శ్లాబులు అశాస్త్రీయంగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలపై భారం మోపేలా శ్లాబులు ఉండటం సరికాదన్నారు. తగిన సమయం ఇవ్వకుండా ప్రభుత్వం హడావుడిగా జీఎస్టీని అమల్లోకి తెస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ జీఎస్టీని ఎందుకు వ్యతిరేకించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గో రక్షకులపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని సురవరం తెలిపారు.