మహారాష్ట్రలో ముగుస్తున్న నామినేషన్ల గడువు-ఇంకా తేలని కాంగ్రెస్,ఉద్ధవ్ సేన సీట్లు..!
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయేపై పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్న విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమికి సీట్ల పంపకాలు తలనొప్పిగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇవాళ్టితో ముగుస్తున్నా ఇంకా పలు చోట్ల సీట్ల పంపకాలపై క్లారిటీ రావడం లేదు. దీంతో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో బీఫామ్ లతో అభ్యర్ధులు పరుగులు తీయక తప్పేలా లేదు.
ముఖ్యంగా మహా వికాస్ అఘాడీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఉద్ధవ్ సేన మధ్య సీట్ల పంపకాలు ఇంకా తేలలేదు.
ఇప్పటివరకూ ప్రకటించిన సీట్ల జాబితా ప్రకారం చూస్తే కాంగ్రెస్ 102 సీట్లకు పోటీ చేస్తోంది. ఉద్ధవ్ సేన 84 సీట్లలోనూ, పవార్ ఎన్సీపీ 82 సీట్లలోనూ పోటీ చేస్తోంది. దీంతో మూడు పార్టీలు కలిపి 268 సీట్లకు అభ్యర్ధుల్ని ప్రకటించినట్లయింది. మిగిలిన 20 సీట్లకు అభ్యర్ధుల ఖరారు విషయంలో కాంగ్రెస్, ఉద్ధవ్ సేన మధ్య ప్రతిష్టంభన నెలకొంది.

ముంబై మహానగర పరిధిలోకి వచ్చే వెర్సోవా, బైకుల్లా, వడాలా సీట్ల విషయంలో కాంగ్రెస్ చివరి నిమిషం వరకూ పట్టుబట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా సీట్లలో ఇప్పటికే ఉద్ధవ్ సేన అభ్యర్ధుల్ని ప్రకటించింది. దీంతో వారిని ఉపసంహరించుకునేలా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వీటికి బదులుగా బోరివాలీ, ములుంద్ సీట్లు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ రమేశ్ చెన్నితాల తుది చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications