వయస్సే గానీ రాహుల్కు బుర్ర పెరగడం లేదు: జైట్లీ
న్యూఢిల్లీ: ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్కు వయసు పెరుగుతున్నా బుర్ర పెరగడం లేదన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ రాహుల్కు అజ్ఞానం పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. నిన్న పార్లమెంటులో మాట్లాడే సమయంలో రాహుల్ గాంధీ ముందే తయారు చేసుకున్న నోట్స్ నుంచి చదివారని ఆయన అన్నారు. రాజీనామాలు చేసిన తర్వాత చర్చ జరగాలని కాంగ్రెసు అంటూ వస్తోందని, తాము చర్చకు సిద్ధంగా ఉన్నామనే చెబుతూ వచ్చామని ఆయన అన్నారు.
వయస్సు పెరుగుతున్నా కొద్దీ పరిపక్వత పెరుగుతుందని భావిస్తామని, కానీ రాహుల్ గాంధీలో వయస్సు పెరుగుతున్నా కొద్దీ అపరిపక్వత పెరుగుతోందని ఆయన అన్నారు. ఎన్డియె నిర్వహించిన మార్చ్ నిరసన తెలపడానికి కాదని, కారణం లేకుండా సమావేశాలను అడ్డుకున్న తీరును తెలియజేయడానికేనని ఆయన అన్నారు. నోరు చేసుకుని కాంగ్రెసు పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసిందని ప్రగతిని అడ్డుకోవాలని చూస్తోందని ఆయన అన్నారు.

తమ చేతుల్లో అధికారం లేదనే విషయాన్ని జీర్ణించుకోవడానికి కాంగ్రెసు సిద్ధంగా లేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నినాదాలకు, ప్రసంగాలకు మధ్య తేడా లేకుండా వ్యవహరించారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ అభివృద్ధి నిరోధక పార్టీగా మారిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ బండారాన్ని బయటపెడతామని, ఎన్డీఏ నేతలు కాంగ్రెస్ను ఎండగడుతారని అన్నారు.
అభివృద్ధిని కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని వెంకయ్యనాయుడు ఆరోపించారు.












Click it and Unblock the Notifications