కర్నాటకలో కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు, యోగీ-మోడీ రావాల్సిన అవసరమేమిటి: శివసేన
ముంబై: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందుస్థానంలో నిలుస్తుందని శివసేన రాజ్యసభ సభ్యులు, సామ్నా పత్రిక కార్యనిర్వాహక సంపాదకులు సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. కేంద్ర యంత్రాంగం మొత్తాన్ని కర్నాటకలో ప్రచారం కోసం వినియోగించడం సరికాదన్నారు.
చదవండి: అమిత్ షా, మోడీలకు సిద్ధరామయ్య ఊహించని ఝలక్, లీగల్ నోటీసులు: ఇదీ కారణం
ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీజేపీ పాలిక ముఖ్యమంత్రులు, కీలక నేతలు తమ సొంత రాష్ట్రాల్లో పాలనను గాలికి వదిలేసి, ప్రచారంలో మునిగిపోతారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఉండి దేశాన్ని పాలించాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని అభిప్రాయపడ్డారు.
కర్నాటకకు వచ్చి సభల మీద సభలు పెట్టి ప్రచారం చేయాల్సిన గత్యంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏమి వచ్చిందని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైన కూడా ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన వదిలేసి యూపీ సీఎం రావడం ఏమిటన్నారు.
అంతేకాదు, బీజేపీ రాష్ట్రానికి చెందిన తమ సొంత నేతలనే నమ్మదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో పాలించాల్సిన మోడీ ఇక్కడకు వచ్చి ర్యాలీలలో పాల్గొనడం ఏమిటన్నారు. ఇప్పుడు ప్రజలు రాహుల్ గాంధీ చెప్పేది వినడం ప్రారంభించారన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందన్నారు.