అమిత్ షా, మోడీలకు సిద్ధరామయ్య ఊహించని ఝలక్, లీగల్ నోటీసులు: ఇదీ కారణం
బెంగళూరు: కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఊహించని ట్విస్ట్! ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తనపై భారతీయ జనతా పార్టీ చేస్తోన్న ప్రచారం నిరాధారమైనదని చెబుతూ ఆ పార్టీ ముఖ్య నేతలకు లీగల్ నోటీసులు ఇచ్చారు.
తనపై బీజేపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఆ పార్టీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప యెడ్యూరప్పలకు ఆయన నోటీసులు జారీ చేశారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడి పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను సిద్ధరామయ్య గతంలో చైనాలో కలుసుకున్నారని, వారి నుంచి విలువైన బహుమతుులు అందుకున్నారని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది.
యడ్యూరప్పతో సవాల్కు సిద్ధం
ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య లీగల్ నోటీసులు పంపించారు. తనపై అవినీతి ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదో తెలపాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు. అవసరమైతే నరేంద్ర మోడీ కూడా ఈ బహిరంగ చర్చలో పాల్గొనవచ్చన్నారు.
నేను ఏ పేపర్ లేకుండా మాట్లాడుతా
కావాలంటే వాళ్లు పేపర్ చూసుకొని చర్చలో మాట్లావచ్చని తాను ఏ పేపర్ లేకుండా మాట్లాడతానని సిద్ధరామయ్య సవాల్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఎందరినో కలుస్తుంటామని, ఇలాంటి నిరాధార ఆరోపణలతో బీజేపీ తనను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
స్పందించిన బీజేపీ
సిద్ధరామయ్య లీగల్ నోటీసులపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ ఓటమి తప్పదని గ్రహించిందని వ్యాఖ్యానించింది. ఇది గ్రహించిన సిద్ధరామయ్య నిరాశ, నిస్పృహలతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
రాహుల్ గాంధీపై ప్రశంసలు
ఇదిలా ఉండగా, కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ దూసుకు వెళ్తున్నారు. దీనిపై శశిథరూర్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో స్పందించడం, సమకాలీన అంశాలపై సమయానుకూలంగా స్పందించడం కారణంగా రాహుల్ గాంధీ గురించి ప్రజల్లో కొత్త అభిప్రాయం నెలకొందని శశిథరూర్ అన్నారు. ఒకప్పుడు రాజకీయాలపై అయిష్టత ఉన్న ఉదాసీనత నేతగా ఆయనను చూశారని, ఇప్పుడు అంకితభావం కలిగి నాయకుడిని చూస్తున్నారన్నారు. ఎవరినీ పట్టించుకోవద్దని, రాహుల్ ఇలాగే సాగిపోవాలన్నారు.