కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు: జన్ కీ బాత్ సర్వేలో గెలుపు ఎవరిదంటే?
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేజిక్ ఫిగర్కు సమీపంలో నిలుస్తుందని జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఇప్పటికే టీవీ 5 సర్వేలోను బీజేపీ గెలుస్తుందని తేలింది. జన్ కీ బాత్ సర్వేలోను బీజేపీకి 102 నుంచి 108 సీట్లు వస్తాయని తెలిపింది.
మే 3వ తేదీ వరకు లక్షా ఇరవై వేల మంది నుంచి జన్ కీ బాత్ అభిప్రాయ సేకరణ చేసింది. ఈ సర్వేలో బీజేపీ బాగా పుంజుకుందని, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు చతికిలపడతాయని పేర్కొంది.
ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 72-74 స్థానాలు, జేడీఎస్కు 42-44 స్థానాలు వస్తాయి. ఇతరులకు రెండు స్థానాలు వస్తాయి. మే 3 తర్వాత ప్రచారానికి మరో వారం గడువు ఉండటటంతో ఓటర్లలో కమలానికి మద్దతు పెరిగే అవకాశముందని పేర్కొంది. మరోవైపు, కర్నాటకలో 55 శాతం మంది ప్రధానిగా మోడీని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపులో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ఇందుకు సంబంధించిన గణాంకాలను వెల్లడించింది.
మొత్తం 2,560 మంది అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా 391 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఏడీఆర్ నిర్ధారించింది. బీజేపీ నుంచి 223 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా 83 మంది (37 శాతం) అభ్యర్థులపై క్రిమినల్ కేసులు, 59 మందిపై (26 శాతం) హత్యలు వంటి క్రిమినల్ కేసులు ఉన్నాయి.
కాంగ్రెస్ నుంచి 220 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 59 (27 శాతం) మందిపై క్రిమినల్ కేసులు, 32 మందిపై (15 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. జేడీఎస్ నుంచి 199 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 41 (21 శాతం) మందిపై క్రిమినల్ కేసులు, 29 మందిపై (15 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి.