లాక్ డౌన్పై కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త గైడ్ లైన్స్లో బిగ్ రిలీఫ్..?
లాక్ డౌన్ 2.0 ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో లాక్ డౌన్ను పొడగిస్తారా.. లేక ఎత్తేస్తారా అని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనిపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. కోవిడ్-19పై పోరుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు మే 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇందులో భాగంగా చాలావరకు జిల్లాల్లో సడలింపులకు అవకాశం ఉంటుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టతనిస్తామని తెలిపింది.
దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ చర్యలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం(ఏప్రిల్ 29)న సమీక్షా సమావేశం నిర్వహించింది. లాక్ డౌన్ కారణంగా చాలావరకు పరిస్థితులు మెరుగుపడ్డాయని.. ఇదంతా చెడిపోకుండా ఉండాలంటే మే 3వ తేదీ వరకు తప్పనిసరిగా లాక్ డౌన్ పాటించాలని పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులకు తరలించేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ రివ్యూ సమావేశంలో కీలక విషయాలపై చర్చించింది.
కాగా, వలస కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులు ఇలా వివిధ కారణాలతో స్వస్థలాలకు దూరంగా చిక్కుకుపోయినవారిని తరలించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. సుప్రీం కోర్టులో వలస కార్మికుల సమస్యలపై దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ ప్రారంభమైన మరుసటి రోజే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.
కేంద్రం కల్పించిన తాజా వెసులుబాటు ప్రకారం.. వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తారనే విషయాన్ని ముందుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపాల్సి ఉంటుంది. అలాగే తమ స్వంత రాష్ట్రం నుంచి అందుకు అనుమతి పొందాల్సి ఉంటుంది. వీరికోసం ప్రత్యేక హెల్త్ చెకప్లు నిర్వహించనున్నారు.కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. తమ స్వంత రాష్ట్రాలకు చేరుకున్న తర్వాత 14 రోజుల పాటు హోమ్ క్వారెంటైన్లో ఉండాలి. వీరిని తరలించేందుకు రాష్ట్రాల మధ్య బస్సులను నడపవచ్చు. ఇందుకోసం బస్సును ముందుగానే పూర్తిగా శానిటైజ్ చేస్తారు. అలాగే బస్సులో ప్రయాణించేటప్పుడు సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి.