వ్యాక్సిన్ల సరఫరా పెంపుకు తీవ్ర ప్రయత్నాలు-ప్రధాని మోడీ ప్రకటన
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మూడోదశను వ్యాక్సిన్లు లేకుండానే ప్రకటించి అభాసుపాలవుతున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సమాధానం చెప్పుకోలేని పరిస్ధితుల్లో ఉంది. దీంతో తమపై ఎదురవుతున్న విమర్శలపై ప్రధాని మోడీ ఇవాళ మరోసారి స్పందించారు. దేశంలో వ్యాక్సిన్ల సరఫరాను మెరుగుపర్చేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని మోడీ వెల్లడించారు.
Recommended Video
దేశవ్యాప్తంగా కేంద్రం ప్రకటించిన మూడో దశ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, వ్యాక్సిన్లు వృధా చేయకుండా అందరూ సహకరించాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. సరైన విధానాలు అవలంబించడం ద్వారా వ్యాక్సిన్ల వృధాను జీరోకు తీసుకెళ్లాలని ప్రధాని మోడీ సూచించారు. కోవిడ్ నియంత్రణలో పాలుపంచుకుంటున్న వివిధ రాష్ట్రాల అధికారులతో ఇవాళ మాట్లాడిన ప్రధాని.. ఈ మహాయజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.
వివిధ రాష్ట్రాల్లో కోవిడ్పై జరుగుతున్న పోరాటాన్ని నడిపిస్తున్న అధికారుల్ని ప్రధాని మోడీ ఫీల్డ్ కమాండర్లుగా అభివర్ణించారు. కరోనాపై పోరాటం సందర్భంగా మీరు సాధించే అనుభవం మీ భవిష్యత్తులోనూ ఉపయోగపడుతుందని ప్రధాని వారికి తెలిపారు. ఈ అనుభవంతో భవిష్యత్తులో ఎలాంటి కఠినమైన సమస్యలనైనా ఎదుర్కొనే సామర్ద్యం మీకు వస్తుందన్నారు. ఇందులో మీ ఫీడ్బ్యాక్ కూడా ఎంతో పనికొస్తుందన్నారు.