ప్రియురాలితో పెళ్లి: తర్వాతిరోజే మరో యువతితో..
ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి - చెన్నైనంగనల్లూరుకు చెందిన రంగనాయుడు, మల్లిక దంపతుల కుమారుడు కార్తికేయన్ చెన్నై అడయారు ఏసిబి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. పునిదతోమయార్ మలైకు చెందిన కాల్ సెంటర్ ఉద్యోగిని ఫిలోమినాతో గత ఆరేళ్లుగా ప్రేమాయణాన్ని నడిపాడు. వివాహం చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతో నవంబర్ 6న సంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నాడు.
ఆ తర్వాత తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని ప్రియురాలు కోరడంతో నవంబర్ 13న చెన్నై రాయపురంలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్డ్ వివాహం చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా తిరువణ్ణామలై జిల్లా సెయ్యూరు తాలూకాకు చెందిన మరో యువతితో నవంబర్ 14 గురువారం నాడు కార్తికేయన్ రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. ప్రియురాలితో రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకున్న బుధవారం సాయంత్రమే తన తల్లిదండ్రులు, బంధుమిత్రులతో కలిసి రెండో వివాహం నిమిత్తం కాంచీపురంలోని కల్యాణ మండపానికి చేరుకున్నాడు.
గురువారం ఉదయం 9గంటలకు తన రెండో వివాహానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. అయితే విషయం తెలుసుకున్న తన మొదటి భార్య ఫిలోమినా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులను వెంట తీసుకుని వచ్చిన ఫిలోమినా కళ్యాణ మండపంలోనే కార్తికేయన్ను తమ వివాహ విషయంపై ప్రశ్నించింది. దీంతో ఫిలోమినాతో వివాహమైన విషయాన్ని కార్తికేయన్ అంగీకరించాడు. రెండో వివాహాన్ని నిలిపి వేసిన పోలీసులు నిందితుడు కార్తికేయన్ను అరెస్ట్ చేశారు.