మళ్ళీ భారత్ లో కరోనా కేసుల ఉప్పెన .. 43 వేలకు పైగా కొత్త కేసులు, 4 లక్షలకు యాక్టివ్ కేసులు
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా మళ్లీ 40000 దాటి కరోనా కేసులు నమోదయ్యాయి. కొంతకాలంగా రోజువారీ కరోనా కేసులలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గురువారం తాజాగా 43,263 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశ రోజువారీ కరోనా కేసులు14 శాతానికి పైగా పెరిగాయి. గత 24 గంటల్లో మొన్నటితో పోలిస్తే దాదాపు ఆరు వేల కేసులు పెరగడం గమనార్హం. గత 24 గంటల్లో 338 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక దేశంలో యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1.19 శాతంగా ఉన్నాయి.
డెల్టా వేరియంట్ యమా డేంజర్ .. వ్యాక్సిన్ల నిరోధక శక్తి కంటే డెల్టా వేరియంట్ కు 8 రెట్లు అధిక శక్తి
3.31 కోట్లు దాటిన మొత్తం కేసుల సంఖ్య
తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31 కోట్లు దాటింది. ఇప్పటివరకు భారత దేశంలో కరోనా కారణంగా 4,41, 749 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో 40, 567 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. రోజువారి నమోదైన కేసుల తో పోలిస్తే, నమోదైన రికవరీలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం . ఇప్పటి వరకు దేశంలో 3.23 కోట్ల మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం రికవరీ రేటు 97.48 శాతం గా ఉంది.
కేరళలో కరోనా పంజా .. 30 వేలకు పైగా కేసులు కేరళ నుండే
అటు కొత్త కేసులు పెరగడంతో యాక్టివ్ కేసులు మళ్లీ నాలుగు లక్షలకు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,93,614 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక క్రియాశీల కేసులో రేటు 1.19% గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు ఇప్పుడు 2.38 శాతంగా ఉంది. ఇది చాలా కాలంగా మూడు శాతం కంటే తక్కువగా నమోదవుతుంది. గత 24 గంటల్లో కేరళలో 30,196 కేసులు మరియు 181 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కరోనా కేసులలో కేరళ రాష్ట్రమే అధికంగా కేసులను అందిస్తుంది. గత 24 గంటల్లో 1,71,295 నమూనాలను పరీక్షించిన తర్వాత, పాజిటివిటీ రేటు బుధవారం 17.63 శాతానికి పెరిగింది.
మహారాష్ట్రలోనూ పెరుగుతున్న కేసులు .. ముఖ్యంగా ముంబైలో కరోనా ఆందోళన
భారతదేశ రోజువారీ సంఖ్యకు కరోనా కారణంగా దెబ్బ తిన్న మహారాష్ట్ర కూడా 4,174 కేసులు మరియు 65 మరణాలను జోడించింది. అహ్మద్నగర్ జిల్లాలో అత్యధికంగా 786 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి, తరువాత పుణే జిల్లా 529 కరోనా కేసులు నమోదు చేసింది. ఇప్పుడు మహారాష్ట్రలో 47,880 క్రియాశీల కరోనావైరస్ కేసులు ఉన్నాయి.గత 24 గంటల్లో ఢిల్లీలో 41 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 14,38,082 కి చేరుకుంది. దేశ రాజధానిలో కనీసం 1,42,51,101 మందికి వ్యాక్సిన్ ఒక డోస్ ఇవ్వబడింది.
Recommended Video
ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో దాదాపు 45,29,715 మరణాలు
దేశంలో నిర్వహించే కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదుల మొత్తం సంఖ్య 71 కోట్లు దాటింది. బుధవారం రాత్రి 7 గంటల వరకు 73 లక్షలకు పైగా (73,80,510) వ్యాక్సిన్ డోసులు ఇవ్వబడ్డాయని సమాచారం.కరోనావైరస్ 2019 డిసెంబర్లో చైనాలో వ్యాప్తి చెందినప్పటి నుండి కనీసం 45,29,715 మంది మరణించినట్లు తెలుస్తోంది. 652,654 మరణాలతో అమెరికా అత్యంత ప్రభావిత దేశంగా మారగా ఇప్పటివరకు బ్రెజిల్ లో 584,421 మరణాలు, భారతదేశంలో 441,749 మరణాలు, మెక్సికోలో 265,420 మరణాలు , పెరూలో 198,595 మరణాలు సంభవించాయి.