Corona in India : 36 వేలకు పైగా కొత్త కేసులు, 530 మరణాలు, ఆ రాష్ట్రంలోనే 59శాతం కేసులు !!
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా భారతదేశంలో కరోనా కేసులలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో భారత్ లో 36,401 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య గురువారం 32,322,258 కి పెరిగింది. గత 24 గంటల్లో 530 మంది కరోనా సోకిన రోగులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన మరణాల సంఖ్య 433,049 కి చేరుకుంది.

గణనీయంగా తగ్గిన యాక్టివ్ కేసులు .. తాజాగా లెక్క ఇదే
గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారిన పడిన వారు 39,157 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తంగా దేశంలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3,15,25,080 కి చేరుకుంది. యాక్టివ్ కేసులు 369,129 కి తగ్గాయి. కరోనా యాక్టివ్ కేసులు ఇంత తక్కువగా నమోదు కావడం149 రోజుల్లో ఇదే మొదటిసారి. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1.13 శాతం గా ఉంది. ఇక రికవరీ రేటు 97.52 శాతం గా నమోదయింది.

క్షీణిస్తున్న ఆర్ ఫ్యాక్టర్ రేటు .. దేశానికి ఊరట
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది. 24 గంటల్లో 56,36,336 మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 56.64 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయినట్లుగా సమాచారం. ఇక కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతున్న వేగాన్ని సూచించే రీ ప్రొడక్షన్ రేట్ ప్రస్తుతం తక్కువగా ఉండటం దేశానికి కాస్త ఊరట కలిగిస్తుంది. మరోపక్క కరోనా థర్డ్ వేవ్ ఉధృతంగా ఉండబోదని నిపుణులుసూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే అంత ప్రమాదకరంగా మారదని అంటున్నారు.

దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో కేసుల జోరు .. కేరళలో దారుణంగా
భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసు నమోదు ఎక్కువగా కనిపిస్తుంది. కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 21, 427 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కేసులు అక్కడే నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలోనే 59శాతం కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. కేరళ తర్వాత మహారాష్ట్రలో 5,132 కరోనా కేసులు నమోదు కాగా ఆ తర్వాతి స్థానంలో తమిళనాడులో 1,797 కేసులు ఆంధ్రప్రదేశ్లో 1,433 కేసులు కర్ణాటక రాష్ట్రంలో 1,365 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్లో 646 కరోనా కేసులు, ఒడిశాలో 993 కరోనా కేసులు, మిజోరంలో 600 కేసులు నమోదయ్యాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అమెరికాలో కరోనా మరణ మృదంగం .. బూస్టర్ డోసుల అవసరం
ఇదిలా ఉంటే అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అమెరికాలో కరోనా కారణంగా గంటకు 42 మంది మృతి చెందుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కోవిడ్ -19 టీకా సామర్థ్యం కాలక్రమేణా తగ్గుతోందని , ఒక వ్యక్తి పూర్తిగా టీకాలు వేసిన ఎనిమిది నెలల తర్వాత మళ్లీ బూస్టర్ షాట్ లను తీసుకోవాల్సిన అవసరం ఉందని యూఎస్ పేర్కొంది. అందుబాటులో ఉన్న డేటా టీకాల ప్రారంభ మోతాదుల తరువాత (కరోనావైరస్) సంక్రమణకు వ్యతిరేకంగా రక్షణ కాలక్రమేణా తగ్గడం కనిపిస్తుందని, డెల్టా వేరియంట్ యొక్క ఆధిపత్యంతో మళ్లీ బూస్టర్ షాట్ లను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని యూఎస్ అత్యున్నత ఆరోగ్య అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications