భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కొత్త కేసులు .. 39,097 తాజా కేసులు, 546 మరణాలు
భారతదేశంలో మళ్ళీ కరోనా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపించింది .కరోనా కేసుల్లో ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కనీసం 39,097 తాజా కేసులు నమోదయ్యాక భారత కోవిడ్ -19 కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం తెలిపింది. దేశంలో శనివారం 546 మరణాలు నమోదయ్యాయి, దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,20,016 గా ఉంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు 3,13,32,159 కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కోవిడ్ -19 యొక్క క్రియాశీల కేసులు 4,08,977 గా ఉన్నాయి. 3,464 కొత్త ఇన్ఫెక్షన్లు తాజాగా క్రియాశీలకంగా మారాయి. దేశంలో క్రియాశీల కేసుల శాతం మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి భారతదేశం చూసిన మొత్తం కేసులలో 1.31 శాతంగా ఉంది .గత 24 గంటల్లో 35,087 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,05,03,166 కు చేరుకుంది. దేశంలో రికవరీ రేటు 97.36 శాతంగా నమోదైందని డేటా తెలిపింది.
కోవిడ్ -19 భద్రతా ప్రోటోకాల్లను ప్రజలు పాటించడం లేదని నిపుణులు నిత్యం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెలాఖరులోగా లేదా సెప్టెంబర్ నాటికి మూడవ వేవ్ దేశంలో పంజా విసురుతుందని అంచనా వేస్తున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా శుక్రవారం మాట్లాడుతూ, రాబోయే నెలల్లో కరోనావైరస్ ఎలా ప్రవర్తిస్తుందో మేము ఊహించలేకున్నామని, మూడవ వేవ్ యొక్క రాక, వ్యాప్తి మనం ఎలా ప్రవర్తిస్తుందనే దానిపై చాలా ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
జన సమూహాన్ని నివారించడం వంటి కోవిడ్ -19 తగిన ప్రవర్తన, మాస్కులు ధరించటం వంటి ఇతర చర్యలు మూడవ వేవ్ యొక్క తీవ్రతను తగ్గిస్తాయని పదేపదే చెప్తున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 4,27,882,261 కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదులను అందించారు. వీటిలో 42,67,799 గత 24 గంటల్లో ఇవ్వబడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి.