భారత్ లో కరోనా మరణ శాసనం : 2,812 మరణాలతో కొత్త రికార్డ్ బ్రేక్ ,3.52లక్షలకు పైగా కొత్త కేసులు
భారతదేశం కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతోంది . కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినా ప్రభుత్వం తీసుకుంటున్న కట్టడ చర్యలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతున్నాయి. ఇక తాజాగా గత 24 గంటల్లో 3,52,991 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశం యొక్క మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163 కు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.
Recommended Video
2,812 మంది మరణాలతో భారత్ లో మరణ మృదంగం
దేశంలో ఆక్సిజన్ కొరత మరియు క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ మధ్య, భారతదేశం అత్యధికంగా ఒకే రోజు స్పైక్లో 2,812 మంది మరణాలను నమోదు చేసింది. దీంతో ఇప్పటి వరకు ప్రాణాంతక మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 1, 95,116 గా ఉంది. దేశంలో కరోనా మరణాల రేటు 1.13% కు చేరుకుంది. దేశంలో ఇప్పుడు 2.8 మిలియన్లకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా సునామీ కొనసాగుతుందని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే కోర్టులు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాయి. కరోనా కట్టడి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
కరోనా రోజువారీ కేసుల్లో నిన్న అత్యధికంగా నమోదైన ఐదు రాష్ట్రాలివే!!
దేశంలో మూడు లక్షలు దాటి కేసులు నమోదు చేయడం ఇది ఐదవ రోజు. ఏప్రిల్ 15 నుంచి భారతదేశ రెండు లక్షలకు పైగా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణకు అద్దం పడుతుంది. ఇక తాజాగా 66,191 కేసులతో మహారాష్ట్ర, 35,311 కేసులతో ఉత్తర ప్రదేశ్, 34,804 కేసులతో కర్ణాటక, 28,469 కేసులతో కేరళ, 22,933 కేసులతో ఢిల్లీ లో రోజు వారి కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఆక్సిజన్ సరఫరా కొరత, వెంటిలేటర్ల కొరత, వైద్య సదుపాయాల లేమితో ఢిల్లీలో గడచిన 24 గంటల్లో 350 మంది కరోనా కారణంగా మరణించారు.
ఢిల్లీలో 300కు పైగా మరణాలు సంభవించడం నాలుగో రోజు
ప్రస్తుతం ఢిల్లీలో కేసుల రేటు 30.21 శాతం గా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా 300కు పైగా మరణాలు సంభవించడం ఢిల్లీలో ఇది నాలుగవ రోజు. ఆక్సిజన్ మరియు బెడ్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఢిల్లీ మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు కరోనా బాధితుల అవసరాలు తీర్చలేక పోతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజధానిలో లాక్డౌన్ పొడిగించారు. ఢిల్లీలో ఉన్న దారుణ పరిస్థితులను ఎదుర్కోవటానికి ఢిల్లీ ప్రభుత్వం నానా అగచాట్లు పడుతుంది.
మహారాష్ట్రలో దారుణ పరిస్థితి ..మహారాష్ట్రలో కొత్తగా 66,191 కేసులు
మహారాష్ట్ర ఆదివారం 832 కోవిడ్ సంబంధిత మరణాలను నమోదు చేసింది, మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అత్యధికంగా ఒకే రోజు పెరిగిన కేసుల సంఖ్య ఇది. నేటి లెక్కతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 64,760 కు చేరుకుంది. ఈ రోజు మహారాష్ట్ర నుండి 66,191 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.మొత్తం కేసుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన ఆరు రాష్ట్రాలలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసులు ఎన్ని ఉన్నాయి అంటే మహారాష్ట్ర లో 41,61,676 కేసులు, కేరళ రాష్ట్రంలో13,22,054 కేసులు, కర్ణాటక రాష్ట్రంలో12,47,997 కేసులు, తమిళనాడు రాష్ట్రంలో10,37,711 కేసులు, మరియు ఆంధ్రప్రదేశ్ లో 9,97,462 కేసులు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 9,76,765 కేసులు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం .. అమెరికా ఫస్ట్ , ఇండియా సెకండ్ ప్లేస్ లో
కరోనా వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 14,77,80,699 మంది ఇప్పటివరకు కరోనా బారిన పడ్డారు. వారిలో 12,57,30,123 మంది కోలుకోగా, ఇప్పటివరకు 31,22,427 మంది మరణించారు. 3,28,24,389 కేసులతో అమెరికా అత్యధికంగా నష్టపోయిన దేశంగా ఉంది. తరువాత స్థానంలో భారతదేశం, బ్రెజిల్, ఫ్రాన్స్ మరియు రష్యా ఉన్నాయి. అయితే, గత ఏడు రోజులలో, భారతదేశం అత్యధికంగా 19,69,569 కేసులను నమోదు చేసింది, ఆ తరువాత అమెరికా 4,49,498 కేసులను, ఆ తర్వాత టర్కీ 4,14,425 కేసులను నమోదు చేసింది.