130 కోట్ల మంది.. 30 రోజులుగా ఇళ్లలో.. లాక్డౌన్కు నెల.. మే 3లోపు కరోనాపై గెలుస్తామా?
లాక్ డౌన్ కారణంగా బ్రేకైపోయిన బ్రెయిన్ ను రిఫ్రెష్ చేసుకోడానికి కొన్ని సెంటెన్సులు ట్రై చేద్దాం.. ''కాలుష్యంతో పూర్తిగా పాడైపోయిన భూగోళాన్ని కాపాడటాని పుట్టిన దేవతే కరోనా''.. ''వ్యవస్థల్ని నాశనం చేయడానికి ఉద్భవించిందే ఈ వైరస్''.. ''ఇలా జరుగుతుందని ఫలానావాడు ముందే చెప్పాడు''.. ''అయితే అయిందిగానీ, నదులు, వాతావరణం ఎంత స్వచ్ఛంగా మారిపోయాయో''.. ''కోవిడ్ కారణంగా చూడలేమనుకున్నవి, కాలేవనుకున్నవన్నీ జరిగాయి, ముఖ్యంగా సంపూర్ణ మద్యనిషేధం, ఫ్యామిలీతో కలిసుండటం''.. రాయడానికి సాంబడు, చెప్పడానికి గబ్బర్ సింగ్ లాంటోళ్లుంటే ఇంతటి విలయకాలంలో వికారాలకు, అద్భుతాలకు కొదువ ఏముంటుంది చెప్పండి?

ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్..
కంటికి కనపడని కరోనా వైరస్ భూమిని చుట్టుముట్టి యావత్ మానవాళితో ఆటలాడుకుంటోంది. గతేడాది చివర్లో చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. రెండు నెలల వ్యవధిలోనే 185 దేశాలకు విస్తరించింది. నాలుగు నెలలుగా విలయతాండవం చేస్తూ దాదాపు 2లక్షల మందిని పొట్టనపెట్టుకోవడమేకాదు.. కొన్ని కోట్ల మంది పొట్టలు కొట్టింది. వైరస్ వ్యాప్తి ఇంకా కట్రోల్ లోకి రాకపోవడంతో లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్స్ అన్నీ ఫెయిలవుతున్నాయి. ఇండియాలో లాక్ డౌన్ ప్రారంభమై నేటికి నెల పూర్తయింది. మార్చి 24 అర్ధరాత్రి నుంచి మన దేశం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఈ ఏడాదికి మన జనాభా 138కోట్లుకాగా, 130 కోట్ల మంది 30 రోజులుగా ఇళ్లకే పరిమితమైపోయారు. ఇంకొందరు షెల్టర్ హోమ్స్ లో తలదాచుకున్నారు. మిగతావాళ్లతా అత్యవసర సేవల్లో నిమగ్నమైపోయారు.

పాండమిక్ ప్రధాన లక్షణం..
సువిశాల భారతావనిలో టీబీ(క్షయ వ్యాధి) కాటుకు ఏటా 4.5 లక్షల మంది చనిపోతుంటారు. మలేరియా కారణంగానూ నెలకు కనీసం 1000మంది ప్రాణాలు విడుస్తుంటారు. రోడ్డుప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, సాధారణ మరణాల జోలికి మనం పోవడంలేదు. ఆ సంఖ్యతో పోల్చుకుంటే కరోనా వైరస్ వల్ల సంభవించిన సుమారు 700 మరణాలు తక్కువ కౌంటే. అయినాసరే ప్రజలకు, ప్రభుత్వాలకు పట్టరానంత భయం. ఎందుకంటే భయపెట్టడం పాండమిక్ ప్రధాన లక్షణం. కరోనాను పాండమిక్(మహమ్మారి)గా గుర్తించిన ప్రపంచ ఆరోగ్యం సంస్థ.. అది ఇంకొంతకాలం మనతోనే ఉంటుందని తేల్చేసింది.

అకాలంలో ఆకలి..
ఏ దేశంలోనైనా ఆకలి మరణాలు సంభవించడం ప్రభుత్వాలకు సిగ్గుచేటే. నిజంగా అవి చోటుచేసుకున్నా నిజాల్ని బయటికిరాకుండా చూసుకుంటాయి. అనధికారిక లెక్కల ప్రకారం లాక్ డౌన్ 30 రోజుల్లో కనీసం 200 మంది పేదలు ఆకలితోనో, ఆస్పత్రులకు వెళ్లే వీలు లేకనో చనిపోయి ఉంటారని ప్రముఖ జర్నలిస్ట్ మానవి కపూర్ రాశారు. వాళ్లలో ఎక్కువ మంది ఉపాధిలేక ఊళ్లబాట పట్టిన వలస కూలీలేనని ఉదాహరణలతో సహా నిరూపించేందుకు ఆమె ప్రయత్నించారు. పైసా సంపాదన లేక జనం పస్తులుంటున్న విషయాలు, వాళ్ల ఆకలి తీర్చేందుకు తోటివాళ్లంతా సాహాయపడుతున్న దృశ్యాలు మనకిప్పుడు అలవాటైపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో పేదలు కేకలు వేయడానికి కూడా ఓపికలేనంత ఆకలితో అలమటిస్తున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి.

లెక్కలు తేలాల్సిఉంది..
పేదోళ్లు పూర్తిగా జీవితాలనే కోల్పోయేలా.. మధ్యతరగతివాళ్లు ఇంకా దిగజారేలా.. డబ్బున్నవాళ్లు సుదీర్ఘకాలం సమస్యల్ని ఎదుర్కొనేలా విలయాన్ని సృష్టించింది కరోనా మహ్మారి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇప్పటికూ బంద్ అయిపోగా, ఐటీ, మీడియా, టూరిజం, హాస్పిటాలిటీ.. ఇలా సేవారంగంలోని దాదాపు అన్ని కంపెనీలూ ఉద్యోగుల్ని తొలగించడమో, జీతాలు కత్తిరించడమో చేశాయి. టోటల్ గా ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారో, ఇంకెంత మంది బికారులయ్యారో లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాతగానీ లెక్కలు తేలవు.
Recommended Video

మే 3 తర్వాత?
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ప్రామాణిక వ్యవస్థల హెచ్చరికల ప్రకారం కరోనా వైరస్ ప్రభావం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశముంది. ఇయాన్ లిప్కిన్ లాంటి ప్రముఖ సైంటిస్టులైతే.. విరుగుడు వ్యాక్సిన్ కనిపెట్టేదాకా మామూలు పరిస్థితి రాబోదని తేల్చేశారు. జనాభా పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన ఇండియాలో.. అదికూడా ఆరోగ్య రంగం ఇప్పుడిప్పుడే గాడినపడుతున్నవేళ.. వైరస్ కంట్రోల్ లోకి రాకముందే లాక్ డౌన్ ఎత్తేస్తే దుష్పరిణామాలు తప్పవని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఎకనమిస్టులు చెబుతున్నారు. ముందుగా పేదలకు తిండిగింజలు పంచి, తలారూ.7500 ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలను ఆదుకుంటుందనే ఆశతో ముఖ్యమంత్రులంతా కేంద్రంవైపు చూస్తున్నారు. మే 3 తర్వాత మోదీ తీసుకోబోయే నిర్ణయంపైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంది. అటు ప్రపంచ దేశాలదీ ఇదే పరిస్థితి.












Click it and Unblock the Notifications