OneIndia Exclusive:కరోనాను ఎలా జయించాడో చెప్పుకొచ్చిన సీనియర్ సిటిజెన్..టిప్స్ చెప్పిన రాజన్..!
బెంగళూరు: కరోనా కబళిస్తోంది. గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతోందని వస్తున్న వార్తలు కాస్త ఊరటనిస్తున్నప్పటికీ... మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే కరోనావైరస్ను జయించాలంటే ముందుగా ధైర్యంగా ఉండి దాన్ని ఎదొర్కోవాలని చాలామంది వైద్యులు చెబుతున్నారు. ఇలా ధైర్యంగా ఉండి పలువురు కరోనాపై విజయం సాధించారు. అలా విజయం సాధించిన వారు తమ వ్యక్తిగత అనుభవాలను వన్ఇండియాతో పంచుకున్నారు. అలాంటి వారిలో బెంగళూరుకు చెందిన డాక్టర్ సీఎస్ రాజన్ కోవిడ్ బారిన పడి విజయవంతంగా ఎలా తిరిగి ఇంటికి చేరుకున్నారో వన్ ఇండియాకు వివరించారు.
కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇతరుల ప్రాణాల కోసం పాటుపడుతున్న వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్లైన్ వారియర్స్కు ధన్యవాదాలు తెలిపారు బెంగళూరుకు చెందిన డాక్టర్ సీఎస్ రాజన్. ఇక తన విషయానికొస్తే తనకు హాస్పిటల్లో మంచి సేవలందించారని కొనియాడారు. స్వతహాగా తాను ఆరోగ్యకరమైన వ్యక్తినని చెప్పుకొచ్చిన రాజన్.. తనకు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేవని స్పష్టం చేశారు. అంతేకాదు కరోనా సమయంలో వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తూచా తప్పకుండా పాటించినట్లు చెప్పారు. అంతేకాదు సీనియర్ సిటిజెన్ కావడంతో రెండు డోసులు వ్యాక్సిన్ కూడా తీసుకున్నట్లు చెప్పారు. అయినప్పటికీ తాను కరోనాబారిన పడినట్లు వెల్లడించారు.
ముందుగా ముక్కు నుంచి నీరుకారడం ప్రారంభమైందని నాలుగు రోజులైనప్పటికీ అది తగ్గకపోవడంతో ఏప్రిల్ 26వ తేదీన ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించగా అందులో కరోనా పాజిటివ్గా తేలిందని చెప్పారు. క్రమంగా నీరసం వచ్చిందని ఆ తర్వాత వాసన పసిగట్టకపోవడం, రుచి అనేది లేకపోవడం తనకు అనిపించిందని చెప్పారు. ఇక మే 3వ తేదీన విపరీతమైన జలుబు చేయడం, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో తన కుటుంబ సభ్యులు బెంగళూరులోని సెయింట్ మార్తాస్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు చెప్పారు. వెంటనే ఐసీయూలో ఉంచి చికిత్స ప్రారంభించినట్లు తెలిపారు. ఆక్సిజన్ కూడా పెట్టినట్లు చెప్పారు డాక్టర్ రాజన్. ఇక తను బతుకుతానని అనుకోలేదని చెప్పారు. రకరకాల ఆలోచనలు తన మదిలో మెదిలినట్లు రాజన్ వివరించారు.
ఇక అలా మూడు రోజులు గడిచాక ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులు తొలిగిపోయాయని చెప్పారు. కోలుకుంటున్నాననే ఆలోచన తనకు తట్టిందని చెప్పారు. తనలో ఏదో తెలియని శక్తి వచ్చిందని వెల్లడించారు. దాదాపు 11 రోజుల తర్వాత ఇంటికి వచ్చినట్లు చెప్పారు. తన అనుభవాలను గురించి చెప్పిన రాజన్.. తాను కరోనాను ఎలా జయించారో కూడా చెప్పారు. తాను తీసుకున్న వ్యాక్సిన్ తనకు ప్రాణరక్షణ కల్పించిందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే వెంటిలేటర్ పై చికిత్సతో పనిలేకుండా పోయిందని చెప్పారు. కాబట్టి వ్యాక్సిన్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడం మరిచిపోకూడదని లేదా అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు డాక్టర్ రాజన్.