దేశంలో మరో కొత్త రకం కరోనా వైరస్- 18 రాష్ట్రాల్లో ప్రభావం- కేంద్రం ప్రకటన
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైందన్న ప్రచారంతో అసలే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న జనానికి కేంద్రం చావు కబురు చల్లగా చెప్పింది. దేశంలోకి మరో కొత్త రకం కరోనా వైరస్ ప్రవేశించిందని కేంద్రం ఇవాళ ప్రకటించింది. 18 రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉందని కనుగొన్నట్లు ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ఎదుర్కొన్న వైరస్తో పోలిస్తే డబుల్ మ్యూటెంట్గా పేర్కొంటున్న దీని ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తాజాగా భారీగా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అర్ధమవుతోంది.
Recommended Video

కొత్త కరోనా వైరస్ కల్లోలం
దేశంలోకి తాజాగా ప్రవేశించిన కొత్త కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే 18 రాష్ట్రాలకు పాకిన ఈ వైరస్ ప్రభావంతో భారీగా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించిన శాంపిల్స్ ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త రకం వైరస్ను డబుల్ మ్యూటెంట్గా పిలుస్తున్నారు. అంటే గతంలో వచ్చిన రకాల కంటే రెట్టింపు ప్రభావం కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని వల్లే తాజాగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు కేంద్రం ప్రకటన బట్టి తెలుస్తోంది.

ఇప్పటికే పలు విదేశీ వైరస్ల దాడి
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పలు వైరస్లు జనంపై దాడి చేస్తున్నాయి. వీటిపై శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధనలు చేస్తున్న తరుణంలోనే ఈ కొత్త వేరియంట్ బయట పడింది. అయితే ఈ ఒక్క కొత్త వైరస్గానే భారత్లో సెకండ్ వేవ్ వచ్చినట్లు చెప్పలేమని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ చెబుతోంది. ఇప్పటివరకూ బ్రిటన్ వైరస్ గుర్తింపు కోసం జరిపిన 10787 పరీక్షల్లో 736 కేసులు బయటపడ్డాయి. అలాగే దక్షిణాఫ్రికా వైరస్పై జరిపిన పరీక్షల్లో 34 మంది బాధితులు తేలారు. బ్రెజిల్ వైరస్ సోకిన బాధితుడు మాత్రం ఒక్కరే తేలారు. దీంతో మరిన్ని శాంపిల్స్ పరీక్షిస్తున్నారు.

10 ల్యాబ్స్లో శాంపిల్స్ పరీక్షలు
దేశవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ద్వారా రకరకాల వైరస్ల వ్యాప్తి కొనసాగుతోంది. వీటిని అరికట్టేందుకు ఇప్పటికే కేంద్రం ఏప్రిల్ 30 వరకూ అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. అయితే ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన ఈ వైరస్ల దాడిని వెంటనే గుర్తించడంలో మన వైద్య వర్గాలు విఫలమయ్యాయి. దీంతో ఇప్పుడు పలు రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన వారి నుంచి సేకరించిన శాంపిల్స్ను దేశంలోని 10 జాతీయ స్ధాయి ల్యాబ్లో పరీక్షిస్తున్నారు. వీటిపై జరుగుతున్న జీనోమ్ అధ్యయనాల్లో పలు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.

పండగల దృష్ట్యా అప్రమత్తం చేస్తున్న కేంద్రం
దేశంలో గతేడాది నవంబర్ తర్వాత తొలిసారి భారీ సంఖ్యలో కేసులు ఇవాళ నమోదయ్యాయి. గత 24 గంటల్లో 47262 కొత్త కేసులు నమోదు కావడం అధికారుల్ని కలవరపెడుతోంది. దీంతో త్వరలో జరిగే హోలీ, షబే బరాత్, ఈస్టర్, రంజాన్ పండుగల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అనుమానితులకు చేస్తున్న పరీక్షల్లో ఎక్కువశాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఉండేలా చూసుకోవాలని కూడా కేంద్రం కోరుతోంది. కచ్చితమైన వైరస్ ఆనవాళ్ల గుర్తింపు కోసం ఆర్టీపీసీఆర్ టెస్టులకే కేంద్రం మొగ్గు చూపుతోంది. అయితే ఖర్చుతో కూడిన ఆర్టీపీసీఆర్ టెస్టుల విషయంలో రాష్ట్రాలు అంత చురుగ్గా స్పందించడం లేదు.












Click it and Unblock the Notifications