మూడో వేవ్ ప్రారంభం : భారీగా కేసులు నమోదు : టాస్క్ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా..!!
దేశ వ్యాప్తంగా కరోనా మరోసారి కోరలు చారుస్తోంది. ఊహించని విధంగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో తీవ్రత ఎక్కువగా ఉంది. ఒకే రోజున దేశ వ్యాప్తంగా 50 వేల కేసులకు పైగా నమోదయ్యాయి. ముంబాయిలోనే పది వేల కేసులు రికార్డు అయ్యాయి. ఇదే సమయంలో దేశలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్లేనని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో 75 శాతం కేసులు వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్వే అని చెప్పారు. అయితే, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు.

థర్డ్ వేవ్ లో భాగంగా ఈ తీవ్రత
భారత్ లో తీవ్రత చూస్తుంటే దక్షిణాఫ్రికా తరహాలోనే మూడోవేవ్ ఉద్ధృతి ఉండవచ్చని డాక్టర్ అరోరా అంచనా వేశారు. గత పదిరోజుల్లో ఇన్ఫెక్షన్ ప్రవర్తనను చూస్తుంటే త్వరలోనే మూడో ముప్పు గరిష్ఠానికి చేరుకుంటుందని భావిస్తున్నామన్నారు. సౌతాఫ్రికాలో రెండు వారాలకే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయాన్ని డాక్టర్ అరోరా ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, వ్యాధి తీవ్రత, ఆస్పత్రి బారినపడకుండా రక్షణ పొందాలంటే రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఆయన స్పష్టంచేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు
వీటితోపాటు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్తో పాటు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2వేలకు చేరువైంది. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, కేరళలో ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ తొలి వారంలో దేశంలో తొలి ఒమిక్రాన్ కేసును గుర్తించగా, డిసెంబర్ చివరి వారానికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 12 శాతం కొత్త వేరియంట్వేనని ఆరోరా వివరించారు. తదుపరి వారంలో ఇది 28 శాతానికి పెరిగిందన్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుందని అన్నారు.
Recommended Video

ఆందోళన వద్దు.. అప్రమత్తతే ముఖ్యం
ఈ నేపథ్యంలో దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్లేనని స్పష్టం చేశారు. గత నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య దీనికి నిదర్శమన్నారు. మరోవైపు టీనేజర్ల టీకాపై వ్యక్తమవుతున్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. టీకాలు పూర్తిగా సురక్షితమన్నారాయన. అలాగే బూస్టర్ డోసు ఇంపార్టెన్స్పై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో రోజుకు నాలుగు లక్షల వరకు కేసులు నమోదు కాగా, ప్రస్తుతం నార్త్ అమెరికాలో 10 లక్షలు.. ఫ్రాన్స్ లో 2.5 లక్షలు...స్విట్జర్ లాండ్ లో 20 వేల వరకూ కేసులు నమోదైనట్లుగా గుర్తు చేసారు. ఓమిక్రాన్ కారణంగా మరణాల సంఖ్య పెద్దగా నమోదు కావటం లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితికి లాక్ డౌన్ పరిష్కారం కాదని... కంటైన్మెంట్ జోన్లు.. ఎక్కడికక్కడ ఆంక్షలు మాత్రమే వ్యాప్తిని నిరోధిస్తాయని డాక్టర్ అరోరా అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications