covid 19 India update : 24 గంటల్లో 3,967 కేసులు,100 మరణాలు .. 80 వేలు దాటిన కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తుంది. ఇప్పటికే దాదాపు మూడు లక్షల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు . ఇక ఇండియాలో లాక్ డౌన్ పూర్తిగా సడలించనప్పటికీ కరోనా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా నమోదైన కేసులు 3,967 కేసులు, 24 గంటల్లో 100 మరణాలు సంభవించాయి. భారతదేశం యొక్క కరోనా కేసుల సంఖ్య 80,000 దాటింది .
ఇండియాలో కరోనా పంజా ... 78 వేలకు పెరిగిన కేసులు ..లాక్ డౌన్ సడలింపులే కారణమా !!
ఇండియాలో 82,052 కు చేరుకున్న కరోనా కేసులు
భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దేశం ఇప్పుడు కరోనా కేసుల్లో చైనాను అధిగమించనుంది . భారతదేశంలో ప్రస్తుత కేసుల సంఖ్య ఇప్పుడు 82,052 గా ఉంది . ఇప్పటివరకు 2,649 మంది కరోనా పాజిటివ్ తో మరణించారు. ఒక్క 24 గంటల్లో 3,967 కేసులు, 100 మరణాలు సంభవించాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు .ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు కంట్రోల్ లేకుండా పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో ముంబై ఎంఎంఆర్, పిఎంసి, ఔరంగాబాద్, మాలెగావ్, సోలాపూర్ లో మే 31 వరకు లాక్డౌన్ పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది .
మరోమారు లాక్ డౌన్ పొడిగింపు అవకాశం
లాక్ డౌన్ నిబంధనల నుండి చాలా సడలింపులు ఇచ్చిన నేపధ్యంలో కరోనా వ్యాప్తి జరుగుతుందనే భావన కలుగుతుంది. అందుకే కేంద్రం ప్యాసింజర్ రైళ్ళు నడపాలని మొదట నిర్ణయించినా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మళ్ళీ తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది . కేంద్రం ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 17 దాటి మూడోసారి పొడిగిస్తుందా? అంటే పొడిగిస్తుంది అనే భావన కలుగుతుంది . ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ లాక్డౌన్ 4.0 ప్రణాళికను సమర్పించాలని ముఖ్యమంత్రులను కోరారు.
ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షలు దాటిన కరోనా మరణాలు
మూడు లక్షల కోట్ల విలువైన ఉద్దీపనను ఆర్థిక మంత్రి సీతారామన్ నిన్న ప్రకటించారు . ఈ ప్యాకేజీలో వలస కార్మికులకు ఉచిత ఆహార ధాన్యం, రైతులకు రుణ మద్దతు మరియు చిరు వ్యాపారులకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా, ఇప్పటివరకు 4,525,441 మందికి కరోనావైరస్ సోకింది. ఈ వ్యాధి నుండి మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 303,372 గా ఉంది.దీంతో ఇప్పుడు ప్రపంచమే కరోనా మహమ్మారితో వణికిపోతుందని తెలుస్తుంది . ఏది ఏమైనా కరోనా ఎప్పటికీ ఉంటుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకర విషయాన్ని తెలియజేసిన నేపధ్యంలో ఇండియా కరోనా కట్టడికి ఇంకా ఏం చెయ్యాల్సి ఉంది అనేది అంతు చిక్కటం లేదు .