కరోనా వైరస్: మళ్లీ దేశవ్యాప్త లాక్ డౌన్.. కుండబద్దలుకొట్టిన ప్రధాని మోదీ.. సీఎంల కాన్ఫరెన్స్లో..
సైంటిస్టుల నుంచి సామాన్యుల దాకా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇప్పటికే 83 లక్షలు దాటి.. 1కోటి వైపు పరుగులు తీస్తుండగా, మొత్తం మరణాల సంఖ్య 5లక్షలకు చేరువైంది. వైరస్ అతివేగంగా వ్యాపిస్తోన్న ఇండియాలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 10,974 పాజిటివ్ కేసులు, 2003మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్త కేసుల సంఖ్య 3.54లక్షలకు, మరణాల సంఖ్య 12వేలకు పెరిగింది.
Recommended Video

లాక్ డౌన్ 5.0..
కేసులు భారీగా పెరుగుతోన్న ప్రస్తుత దశలో వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రావాలంటే మళ్లీ దేశవ్యాప్త లాక్ డౌన్ విధించాల్సిందేననే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం డైలమాలో పడేంత స్థాయిలో.. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో 5.0పై ఎడతెగని చర్చ నడుస్తున్నది. జూన్ 30తో అన్ లాక్ 1.0 ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఏం చేయబోతున్నదనే విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు.

సీఎంలతో భేటీ..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ.. రికార్డు స్థాయిలో రికవరీ రేటు ఉండటం, మొత్తం కేసుల్లో సగానికిపైగా ఇప్పటికే డిశ్చార్జి అయిపోవడం ఊరట కలిగించే అంశమని, కాబట్టి కేసుల పెరిగినంత మాత్రాన హైరానా పడాల్సిన అవసరం లేదని, అలాగని నిర్లక్ష్యం వహించకుండా, హెల్త్ సెక్టార్ ను బలోపేతం చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. కొవిడ్-19 నేపథ్యంలో ఆయన బుధవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ కు సంబంధించి కొందరు ముఖ్యమంత్రులు వెలిబుచ్చిన అనుమానాలకు ప్రధాని క్లారిటీ ఇచ్చారు.

నో లాక్ డౌన్.. ఓన్లీ అన్ లాక్..
దేశంలో కొవిడ్-19 కేసులు పెరుగుతోన్న దరిమిలా మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ప్రధాని కాన్ఫరెన్స్ అనగానే మీడియాతోపాటు ప్రజలంతా లాక్ డౌన్ పొడగింపు గురించే అనుకునే పరిస్థితి నెలకొందని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రులు కోరాగా.. ఇకపై దేశవ్యాప్త లాక్ డౌన్ ఉండబోదని, లాక్ డౌన్ 5.0 అంటూ జరిగే ప్రచారాలు వట్టివేనని మోదీ క్లారిటీ ఇచ్చారు. ‘‘దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్ డౌన్ ముగిసింది. అన్ లాక్ 1.0 నడుస్తున్నది. రాబోయే రోజుల్లో అన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలి'' అని ప్రధాని కుండబద్దలు కొట్టారు.

భయాన్ని దూరం చేయాలి..
ఆరోగ్య రంగానికి సంబంధించి దేశంలో గడిచిన మూడు నెలల్లో చాలా మార్పులు వచ్చాయని మోదీ గుర్తుచేశారు. కరోనా కష్టకాలాన్ని సవాలుగా తీసుకుని ప్రభుత్వాలు, ప్రజలు ముందుకు సాగడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900కిపైగా టెస్టింగ్ ల్యాబ్లు, లక్షల సంఖ్యలో కోవిడ్ పడకలు, వేలాది క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే వైరస్ పట్ల ప్రజల్లో నాటుకుపోయిన భయాలను దూరం చేయాల్సిన అవసరం ఉందని, రికవరీ రేటు ఎక్కువగా ఉన్నందున ఎవరు కూడా భయపడాల్సిన పనిలేదని భరోసా ఇవ్వాలని సీఎంలకు మోదీ సూచించారు. మాస్కులు, సోషల్ డిస్టెన్సింగ్ నియమాలు తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications