కొవిడ్-19: దేశంలో 606 కేసులు.. ప్రపంచంలో 20వేల మరణాలు
కరోనా వైరస్ గాలికంటే వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దాని కారణంగా వచ్చే కొవిడ్-19 వ్యాధికి గురై జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బుధవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 20 వేలకు చేరువైంది. వైరస్ బారినపడ్డవాళ్ల సంఖ్య 4.40 లక్షలుగా నమోదైంది. అదే సమయంలో వైరస్ బారినపడి కోలుకున్నవాళ్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ 1.12 లక్షలకు చేరింది. అయితే వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో ఈ అంతరం బాగా పెరుగుతున్నది.
ఇండియా విషయాకొస్తే బుధవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 606కు పెరిగింది. వ్యాధి బారిపడ్డవాళ్లలో ఇప్పటివరకు 10 మంది చనిపోగా, 43 మంది కోలుకున్నారు. బుధవారం అత్యధికంగా మహారాష్ట్రలో 128, కేరళలో 109 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనాపై పోరులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో..
దేశవ్యాప్తంగా కొత్తగా 29 ప్రైవేటు ల్యాబ్ లు, 118 ప్రభుత్వ ల్యాబ్ లు ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ శాఖ ప్రధాన కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. ఇప్పటిదాకా కరోనా పరీక్షలు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా నిర్వహించగా, ఇకపై ప్రైవేటు ల్యాబ్లలో నిర్ధిష్ట ధరని నిర్ణయిస్తామని చెప్పారు. హైడ్రో క్లోరోక్విన్ డ్రగ్ ను ఎవరుపడితేవాళ్లు ఇష్టమొచ్చినట్లు వాడరాదని అగర్వాల్ చెప్పారు.
Recommended Video
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 మరణాల్లో సగానికి పైగా యూరప్ లో చోటుచేసుకున్నవే కావడం విషాదం. ఇటలీలో అత్యధికంగా 6,820 మంది చనిపోగా, స్పెయిన్ లో 3,434, ఫ్రాన్స్ 1100, యూకే 433, నెదర్లాండ్స్ 356, జర్మనీలో 181 మరణాలు సంభవించాయి. చైనాలో 3,281, ఇరాన్ లో 2,077, అమెరికాలో 785 మంది ప్రాణాలు కోల్పోయారు.