గతేడాది కంటే వేగంగా కరోనా వ్యాప్తి- 4 వారాలు మరింత కీలకం- కేంద్రం హెచ్చరిక
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. గతేడాది కంటే వేగంగా ఇది విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అర్ధరాత్రి కర్ఫూ మొదలు కాగా.. ఇక పరిస్ధితి మరింత విషమిస్తే లాక్డౌన్లు కూడా తప్పవని తెలుస్తోంది. కరోనా వ్యాప్తిపై తాజాగా రాష్ట్రాలకు హెచ్చరికలు పంపిన కేంద్రం.. రాబోయే నాలుగు వారాల్లో పరిస్ధితి మరింత విషమించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అరికట్టాలని రాష్ట్రాలకు సూచించింది.

వేగంగా విస్తరిస్తున్న కరోనా
దేశవ్యాప్తంగా మరోమారు కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావం తొలుత కొన్ని రాష్ట్రాల్లోనే ఉందని భావించినా ఇప్పుడు రాకపోకల కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపుతోంది. ఓ దశలో వంద కంటే తక్కువ కేసులు నమోదైన ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సైతం ఇప్పుడు రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా తిరిగి రాష్ట్రాల్ని అప్రమత్తం చేసే పనిలో పడింది. సకాలంలో చర్యలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని సీరియస్ వార్నింగ్స్ ఇస్తోంది.

గతేడాది కంటే వేగంగా విస్తరణ
గతేడాది తొలి కరోనా కేసు నమోదైన నాటి నుంచి దేశంలో వెయ్యి కేసులకు చేరడానికి పట్టిన సమయంతో పోలిస్తే ఇప్పుడు విస్తరిస్తున్న వేగం చాలా ఎక్కువగా ఉందని కేంద్రం గుర్తించింది. దీంతో గతంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్ధాయిలో ఉన్నప్పుడు తీసుకున్న చర్యలు ఇప్పుడు మరోసారి అవసరమని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్క్ఫోర్స్ ఛీఫ్ అయిన వీకే పౌల్ వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో కరోనా పతాక స్దాయిలో ఉందని, దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించారు.

రాబోయే నాలుగు వారాలు కీలకం
ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు, మరణాలను బట్టి చూస్తే రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకం కానున్నాయని కోవిడ్ టాస్క్ఫోర్స్ ఛీఫ్ వీకే పౌల్ తెలిపారు. అయితే ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యేందుకు మాత్రం గతంలో వాడిన సాధనాలే అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. దీంతో పాత పద్ధతులతోనే కరోనాను కొత్తగా నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను జోరుగా సాగించాలని ఆయన రాష్ట్రాలను కోరారు. ఇందులో ఎలాంటి అలసత్వానికి తావివ్వొద్దని రాష్ట్రాలను కోరారు.

కరోనా టాప్ 10 జిల్లాలివే...
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న 10 జిల్లాల్లో ఛత్తీస్ఘడ్లోని దుర్గ్ జిల్లా మొదటి స్ధానంలో ఉంది , మహారాష్ట్రలోని ఏడు జిల్లాలు, కర్నాటకలో ఓ జిల్లా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న టాప్ 10 జిల్లాల్లో పూనే, ముంబై, థానే, నాగ్పూర్, నాసిక్, బెంగళూరు అర్బన్, ఔరంగాబాద్, అహ్మద్ నగర్, ఢిల్లీ, దుర్గ్ ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆయా జిల్లాలకు 50 అత్యున్నత స్దాయి వైద్య బృందాలను పంపుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఇవి మహారాష్ట్రలోని 30 జిల్లాల్లో, ఛత్తీస్ఘడ్లోని 11 జిల్లాల్లో, పంజాబ్లోని 9 జిల్లాల్లో పనిచేయనున్నట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications