cVIGIL app నిఘా: ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచితే..నిమిషాల్లో జైలుపాలు
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న ఆంక్షలు కొంత అడ్డంకిగా మారినప్పటికీ- నియోజకవర్గ స్థాయిలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహిస్తోన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర విడుదల చేశారు. ఈ మేరకు దేశ రాజధానిలో ఆయన ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికలను ఎదుర్కొంటోన్న రాష్ట్రాల్లో పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను ప్రకటించారు.
అయిదు రాష్ట్రాల్లో విడతలవారీగా పోలింగ్ను నిర్వహించేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య పోలింగ్ నిర్వహించేలా అన్ని జాగ్రత్తలను తీసుకుంటామని వివరించారు. షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని సుశీల్ చంద్ర తెలిపారు. మోడల కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని, అవి వెంటనే అమలయ్యేలా చూస్తామనీ అన్నారు.
ఎన్నికల అక్రమాలను నివారించడానికి సీవిజిల్ యాప్ (cVIGIL app)ను వినియోగించుకోవాలని సుశీల్ చంద్ర విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటర్ కూడా తాను వినియోగించే స్మార్ట్ఫోన్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డబ్బులు, మద్యం పంచినట్లు తెలిస్తే.. దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా ఎన్నికల అధికారులకు తెలియజేయవచ్చని వివరించారు. ఫిర్యాదు అందుకున్న 100 నిమిషాల్లోనే సమీపంలో ఉన్న ఎన్నికల అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారని చెప్పారు.
ఈ యాప్ వినియోగంపై అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామని సుశీల్ చంద్ర తెలిపారు. దీన్ని ఎలా వినియోగించుకోవాలనే విషయం మీద ఓటర్లకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.