యాస్పై మోదీ పోరు: తుపాను సన్నద్ధతపై ప్రధాని సమీక్ష -ఐదు రాష్ట్రాల్లో అప్రమత్తత
ఇటీవల అరేబియా సముద్రంలో తలెత్తిన తౌక్తే తుపాను పశ్చిమ తీర రాష్ట్రాల్లో మిగిల్చిన నష్టం అంచనాలు పూర్తిగా వెలువడకముందే, తాజాగా తూర్పున ఉన్న బంగాళాఖాతంలో చెలరేగిన యాస్ తుపాను అందర్నీ కలవరపెడుతున్నది. యాస్ తుపాను ఈ నెల 24 -26వ తేదీ మధ్య ఒడిశాలో తీరం దాటుందని, నాలుగైదు రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో..
యాస్ తుపానుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన సన్నాహాలను సమీక్షించేందుకు ఆయన సీనియర్ ప్రభుత్వ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రతినిధులు, టెలికాం, విద్యుత్, పౌర విమానయాన, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ కార్యదర్శులతో సమావేశమవుతారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు కీలక శాఖల మంత్రులు ఉన్నతాధికారులూ ఈ సమావేశంలో పాల్గొంటారు. తుపాను నేపథ్యంలో ఒడిశా గుండా ప్రయాణించే పలు రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ తుఫాను నేపథ్యంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.
యాస్ ను తీవ్ర తుపానుగా పరిగణిస్తోన్న వాతావరణ శాఖ.. అది ఈ నెల 24 -26వ తేదీ మధ్య తీరం దాటొచ్చని, దీని ప్రభావంతో ఐదు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.