Delhi Elections 2020: స్లిప్పులు లేకపోయినా పర్లేదు..స్మార్ట్ఫోన్ ఉంటే చాలు: కోటి 47 లక్షలమంది ఓటర్ల
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం కోటి 47 లక్షల మంది ఓటర్లు శనివారం తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ఆరంభమౌతుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటినప్పటికీ.. క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేయడానికి అవకాశం ఇస్తారు. కమలా నెహ్రూ కళాశాలలో పోలింగ్ సిబ్బందికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్లు, ఇతర సామాగ్రిని అందజేశారు.

భారీ భద్రత..
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో పోలీసులు, ఇతర భద్రతా బలగాలను భారీ ఎత్తున మోహరింపజేశారు. 190 కంపెనీల పారామిలటరీ బలగాలు, 19000 మంది హోమ్గార్డులను అందుబాటులో ఉంచినట్లు డీసీపీ, నోడల్ అధికారి శరత్ కుమార్ సిన్హా వెల్లడించారు. పోలింగ్ సందర్భంగా జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం గేట్ నంబర్ 7 వద్ద నిరసనకారులను ఖాళీ చేయించారు. గేట్ నంబర్ 4 వద్ద వారు నిరసనలను కొనసాగిస్తున్నారు.

షహీన్ బాగ్ వద్ద భద్రత కట్టుదిట్టం..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు కొనసాగుతోన్న షహీన్ బాగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు. వందలాది మందిని పోలీసులు, పారామిలటరీ బలగాలను అక్కడ మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కిందటి నెల 26వ తేదీ నుంచి షహీన్ బాగ్ వద్ద నిరసనకారులు ఏకధాటిగా ఆందోళనలను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే.

ఓటరు స్లిప్పుల అవసరం లేకుండా..
ఓటరు స్లిప్పుల అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ల ద్వారా ఓటర్ల వివరాలను తెలుసుకునే ప్రయోగానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెర తీశారు. దీనికోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓటర్లు తమ స్మార్ట్ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్ను రీడ్ చేసి, వివరాలను తెలియజేయవచ్చు. దీనికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు.

70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో..
ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ను నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీజేపీ సీనియర్ నాయకుడు మనోజ్ తివారీ వంటి హేమాహేమీలు ఉన్నారు. 13750 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 545 పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు. అలాంటి చోట్ల మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications