1987 హషీంపురా ఊచకోత కేసు: 16 మందికి జీవితకాల శిక్ష విధించిన ఢిల్లీ కోర్టు
ఢిల్లీ: 1987లో ఉత్తర్ప్రదేశ్ హషీంపుర ఊచకోత కేసులో 16 మంది పోలీసులకు జీవితకాలం కారాగార శిక్షి విధించింది ఢిల్లీ హైకోర్టు. ఈ ఘటనలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన 42 మంది హత్యకు గురయ్యారు. ఈ కేసును విచారణ చేసిన జస్టిస్ ఎస్ మురళీధర్ , వినోద్ గోయెల్ ధర్మాసనం కింది కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులుగా పేర్కొంది కింది కోర్టు. అయితే కిందికోర్టు తీర్పును సవాలు చేస్తూ బాధితుల తరపున బంధువులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నాడు 16 మంది పోలీసులుగా ఉన్నవారిని దోషులుగా పేర్కొంది. వీరిపై కిడ్నాప్ ఆ తర్వాత హత్య నేరాలు మోపింది. అంతేకాదు సాక్షాలను ధ్వంసం చేయాలని కూడా చూశారని కోర్టు పేర్కొంది.
న్యాయం కోసం 31 ఏళ్లు వేచిచూసిన మృతుల కుటుంబాలు
అమాయక ప్రజలను పోలీసు దళాలు తుపాకులతో దారుణంగా కాల్చి చంపారని కోర్టు వ్యాఖ్యానించింది. మృతుల కుటుంబాలు న్యాయం కోసం 31 ఏళ్లు వేచిచూడాల్సి వచ్చిందని పేర్కొంది. ఇందులో మొత్తం 19 మందిని నిందితులుగా పేర్కొనగా... విచారణ సమయంలో ముగ్గురు మృతి చెందారు. 16 మందిని తీస్హజారీ సెషన్స్ కోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చింది. అయితే తీర్పును సవాల్ చేస్తూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది.
ఒక సామాజిక వర్గానికి చెందినవారిని దారుణంగా కాల్చి చంపిన పోలీసులు
ఇక కేసు పూర్వాపరాల్లోకి వెళితే... హషీంపురాలో నాడు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారిని పోలీస్ బలగాలు చుట్టుముట్టాయి. వారిలో కొందరిని ట్రక్కులో ఎక్కించుకుని కొంత దూరం తీసుకెళ్లి కాల్చి చంపారు. అనంతరం వారి మృతదేహాలను దగ్గరలోని కాలువలో పడేశారు. రెండు రోజుల తర్వాత ఈ మృతదేహాలు బయటపడ్డాయి. అంతకంటే ఒక్క రోజు ముందు పోలీసు బలగాలపై ముస్లిం సామాజిక వర్గం వారు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడులు కూడా హిందూ ముస్లిం అల్లర్ల నేపథ్యంలోనే జరిగాయి.
1996లో ప్రారంభమైన విచారణ
ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకెళ్లి అత్యంత దారుణంగా పోలీసు బలగాలు కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు ప్రముఖ చరిత్రకారులు , నిపుణులు. ఇది భారత దేశ చరిత్రలోనే అత్యంత పాశవికమైన ఘటనగా వారు అభివర్ణించారు. ఇక ఈ కేసుపై 1996లో ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2015లో ట్రయల్ కోర్టు నిందితులందరిని నిర్దోషులుగా తీర్పునివ్వడం జరిగింది. దీనిపై చాలామంది సామాజిక కార్యకర్తలు మండి పడ్డారు. న్యాయం తప్పుదారి పట్టిందని వారు నాడు పేర్కొన్నారు.