ఢిల్లీలో లాక్ డౌన్ జూన్ 7 వరకు పొడగింపు-ఆ రంగాలకు మినహాయింపు-ప్రభుత్వ కీలక నిర్ణయం
ఢిల్లీలో లాక్ డౌన్ను మరో వారం రోజుల పాటు పొడగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 7వ తేదీ ఉదయం 5గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. మాన్యుఫాక్చరింగ్,భవన నిర్మాణ రంగ కార్యకలాపాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిచ్చింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ కార్యకలాపాలు సాగించాలని సూచించింది. నిజానికి ఢిల్లీలో కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేస్తుందని చాలా మంది భావించారు.కానీ ఢిల్లీ ప్రభుత్వం దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేసే యోచనలో ఉన్నట్లు తాజా నిర్ణయంతో స్పష్టమవుతోంది.
మరోవైపు ఢిల్లీలోని వ్యాపారులు మార్కెట్లను తెరిచేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మాన్యుఫాక్చరర్స్కు,భవన నిర్మాణ కార్యకలాపాలకు ఎలాగైతే షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారో తమకు అలాగే అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు.
కరోనా కేసుల విషయానికి వస్తే... ఢిల్లీలో శనివారం(మే 29) కేవలం 956 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరో 122 మంది కరోనాతో మృతి చెందారు. ఈ ఏడాది మార్చిలో 36శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 1.19శాతానికి పడిపోయింది. మార్చి 22 నుంచి ఇప్పటివరకూ వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. చివరిసారిగా మార్చి 21న 823,మార్చి 22న 888 కేసులు నమోదయ్యాయి.
రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత తగ్గుతుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మున్ముందు లాక్డౌన్ను మరింత సడలిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో పునురద్దరించేలా మున్ముందు చర్యలు చేపడుతామని చెప్పారు.
Recommended Video
ఢిల్లీలో గత నెల రోజులుగా అమలుచేస్తున్న లాక్ డౌన్ సత్ఫలితాలనిచ్చింది. ఏప్రిల్ నుంచి కొన్ని వారాల పాటు నిత్యం వరుసగా 20వేల పైచిలుకు కేసులు నమోదవుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం వెయ్యి దిగువకు పడిపోవడం గమనార్హం. అయితే మరణాల సంఖ్య మాత్రం భారీగానే నమోదవుతోంది. గతంలో ఒక్కరోజులో అత్యధికంగా 448 కోవిడ్ మరణాలు నమోదవగా.. ప్రస్తుతం వందకు పైనే నమోదవుతున్నాయి.