వచ్చే వారం ఢిల్లీకి కరోనా వ్యాక్సిన్- ముందుగా అక్కడే పంపిణీ చేసే అవకాశం
దేశంలో కరోనా ప్రభావం తగ్గుతుందని భావిస్తున్న సమయంలో సెకండ్ వేవ్ పేరుతో మరో మహమ్మారి పుట్టుకొస్తోంది. ఎక్కడో బ్రిటన్లో బయటపడినా మన దేశానికి త్వరలోనే వచ్చే ప్రమాదం ఉందని కేంద్రం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్తో పాటు యూరప్ దేశాల నుంచి విమానాల రాకపోకలను నియంత్రిస్తోంది. తాజా వైరస్ ప్రభావంపై దేశ ప్రజల్లో ఆందోళనలు రేకెత్తుతున్నాయి. దీంతో త్వరలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చేవారం చివర్లో ఢిల్లీకి కరోనా వ్యాక్సిన్ తొలి పార్శిల్ రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కరోనా ప్రభావం ఇప్పటికీ అధికంగా ఉన్న ఢిల్లీకి తొలి షిప్మెంట్ను రప్పించి అక్కడ పంపిణీ చేశాక దేశంలోని ఇతర ప్రాంతాలకు దాన్ని పంపే అవకాశం ఉన్న్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో హెల్త్ వర్కర్లను కేంద్రం అప్రమత్తం చేస్తోంది. వచ్చే వారం ఎట్టి పరిస్దితుల్లోనూ వ్యాక్సిన్ వస్తుందని, ముందుగా హెల్త్ వర్కర్లతో పాటు ఎమర్జెన్సీ రోగులకు ఇవ్వనున్నారు.
ఢిల్లీలో వ్యాక్సిన్ పంపిణీ కోసం 3500 మంది హెల్త్ వర్కర్లను అందుబాటులో ఉంచుతున్నారు.. ఇప్పటికే వీరికి పలు దఫాలుగా ట్రైనింగ్ కూడా పూర్తయింది. వ్యాక్సిన్ రాగానే వెంటనే రంగంలోకి దిగి పంపిణీ చేయడమే ఆలస్యం అన్నట్లుగా ఢిల్లీలో పరిస్ధితులు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ రాగానే దాన్ని నిల్వచేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం 609 కోల్డ్ చైన్ స్పాట్లను కూడా సిద్ధం చేస్తోంది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, లోక్నాయక్ ఆస్పత్రి, కస్తూర్బా హాస్పిటల్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రి, జీడీబీ ఆస్పత్రులతో పాటు మొహల్లా క్లినిక్స్ను సైతం వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్లుగా వాడుకోనున్నారు.