పెద్దనోట్ల రద్దు ప్రభావం ఇంకా దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తోంది: మన్మోహన్ సింగ్
ఢిల్లీ: మోడీ సర్కార్ పెద్ద నోట్లు రద్దు చేసి నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ నిర్ణయంతో ఆనాడు దేశమంతా ఇబ్బంది పడిన ఘటనను గుర్తు చేసుకుంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు అయ్యాయి. రెండేళ్ల క్రితం రద్దయిన పెద్ద నోట్ల ప్రభావం ఇప్పటికీ సామాన్యుడిపై ఉందని అన్నారు మన్మోహన్ సింగ్. అంతేకాదు పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చెప్పారు ఈ ఆర్థికవేత్త.
పెద్దనోట్ల రద్దు చారిత్రక తప్పిదం
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనాలోచితమైనదిగా మన్మోహన్ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వల్ల నష్టమే వచ్చింది గానీ ఎవరికీ మేలు చేకూరలేదని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు కాలక్రమంలో వెలుగు చూస్తున్నాయని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో స్థూల దేశీయ ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోయిందని చెప్పారు. అంతేకాదు ఇంకా దేశంలోని పలు చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఇంకా పెద్ద నోట్ల రద్దు నుంచి తేరుకోలేదని ధ్వజమెత్తారు.
పెద్దనోట్ల రద్దుతో యువతకు ఉద్యోగాలు లేవు
పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికీ యువతకు ఉద్యోగాలు లేవని చెప్పిన మన్మోహన్... ఆ ప్రభావం రుణాలు ఇచ్చే పలు ఆర్థిక సంస్థలపై కూడా పడిందని వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయని, రూపాయి విలువ పతనం అవుతున్న నేపథ్యంలో ఇంకా పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది అంచనా వేయడం ఇప్పుడే సాధ్యం కాదని చెప్పారు. వీటన్నిటినీ నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషిచేయాలని చెప్పారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.
దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది
పెద్ద నోట్ల రద్దుతో ఈ రోజు దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్న మన్మోహన్ సింగ్... దీన్ని నుంచి పాఠాలు నేర్చుకుని ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. మరోవైపు పెద్ద నోట్లు రద్దయి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. ఆర్థిక వ్యవస్థను పెద్దనోట్ల రద్దుతో అతలాకుతలం చేసిన ప్రధాని దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.