రేప్ ఆరోపణలతో కలత: ఎన్జీవో ఎగ్జిక్యూటివ్ ఆత్మహత్య
అన్వర్ ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)ను నడుపుతున్నాడు. అతను దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని భవనం రెండో అంతస్థులో నివాసం ఉంటున్నాడు. అతను ఆ భవనం రెండో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్వర్ కిందికి దూకుతుండగా పక్కనే నిర్మాణం పనిలో ఉన్న కార్మికుడు చూశాడు.
అతను విషయాన్ని ఇరుగుపొరుగువారికి చెప్పాడు. వారి సాయంతో అన్వర్ను అస్పత్రికి చేర్చాడు. అయితే, అతను అప్పటికే మరణించాడని వైద్యులు తేల్చారు. డెయిరీలో అన్వర్ రాసిన మూడు పేజీలో నోట్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
మరో ఎన్జీవోల సభ్యురాలిగా ఉన్న అమ్మాయి తనను లక్ష్యం చేసుకుందని అతను ఆ నోట్లో రాశాడు. ఆరోపణలతో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కూడా రాశాడు. తన తప్పేమీ లేకున్నా తనపై అమ్మాయి ప్రచారం చేస్తున్న తీరుకు తీవ్రంగా కలత చెందానని, తన 30 ఏళ్ల ప్రతిష్టను, కెరీర్ను మంట గలిపే పని పెట్టుకుందని అతను ఆ నోట్లో ఆరోపించాడు.
పోలీసులు మంగళవారం అన్వర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. అన్వర్ ఎన్జీవోకు చెందిన సభ్యులతో తాను సెప్టెంబర్ 12వ తేదీన పార్టీకి హాజరయ్యానని, పార్టీలో తాను తాగి వాంతులు చేసుకున్నానని, దాంతో అన్వర్ నివాసంలో ఉండిపోవాలని తనకు చెప్పారని, తాను అంగీకరించానని ఆ అమ్మాయి తన ఫిర్యాదులో వివరించింది.
తాను నిద్రపోయానని, తెల్లారి లేచేసరికి తనపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించానని, బయటకు చెప్తే పరువు పోతుందని మౌనంగా ఉండిపోయానని ఆమె చెప్పింది. కొద్ది రోజుల క్రితం అమ్మాయి జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును కమిషన్ పోలీసులకు పంపించింది.