జగన్కు రఘురామ మరో లేఖ- ఇంత హీట్లోనూ-ఢిల్లీ టూర్లో ఉన్న వేళ
వైసీపీ అధినేత వైఎస్ జగన్కూ, రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వైసీపీ ప్రభుత్వంపై ఏడాదిన్నరగా రఘరామరాజు పోరు చేస్తుంటే, తాజాగా ఆయనపై నాన్ బెయిలబుల్ రాజద్రోహం కేసు పెట్టారు జగన్. ఇలాంటి సమయంలో రఘురామరాజు ఓ కీలకమైన అంశంపై ఆయనకు తాజాగా లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Recommended Video
కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ కోసం సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రి 9 గంటలకు ఆయన అమిత్షాతో భేటీ కానున్నారు. అదే సమయంలో తమకు తలనొప్పిగా మారిన రఘురామకృష్ణంరాజు వ్యవహారంలోనూ తాడోపేడో తేల్చుకుంటారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీలో ఉన్న సమయంలో ఆయనకు రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ లేఖాస్త్రం సంధించారు. దీంతో చాలాకాలం తర్వాత జగన్కు ఆయన ఓ లేఖ రాసినట్లయింది.
సీఎం జగన్కు రాసిన లేఖలో రఘురామకృష్ణంరాజు ఏపీలో వైసీపీ ఎన్నికల హామీల్లో ఒకటైన వృద్ధాప్య పించన్ల హామీని ప్రస్తావించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏఢాది వృద్ధాప్య పించన్లను రూ.250 పెంచిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఏడాది మాత్రం పెంచలేదు. విపక్షాలు అసెంబ్లీలో అడిగితే వచ్చే ఏడాది జూన్లో పెంచుతామన్నారు. దీంతో ఇప్పుడు రఘురామ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్కు లేఖ రాశారు. గతేడాది బకాయి, ఈ ఏడాది ఇవ్వాల్సింది కలిపి మొత్తం రూ.2750 లబ్దిదారులకు ఇవ్వాలని ఈ లేఖలో రఘురామ కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన రూ.3 వేలకు పించన్ పెంపు హామీని జగన్ నిలబెట్టుకోవాలని రఘురామ డిమాండ్ చేశారు.